Share News

CM Revanth Reddy: కొత్తగా 571 ప్రభుత్వ స్కూళ్లు!

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:07 AM

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 20 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట్ల కొత్త బడులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

CM Revanth Reddy: కొత్తగా 571 ప్రభుత్వ స్కూళ్లు!

  • గ్రామాలు, పట్టణాల్లోని బడుల్లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న చోట్ల ఏర్పాటు

  • నాణ్యమైన విద్యకు ఎంత ఖర్చయినా ఓకే హైస్కూల్‌ నుంచే నైపుణ్యాభివృద్ధి ఉండాలి

  • అప్పుడే విద్యార్థులు ఇష్టమైన రంగాల్లో రాణిస్తారు.. విద్యాశాఖ సమీక్షలో సీఎం

  • ఉస్మానియా, జలమండలి, ప్రజారోగ్యంపైనా ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 20 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట్ల కొత్త బడులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విద్యా శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బోధనా ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. హైస్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారికి ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్‌ఎండీఏ, మునిసిపల్‌ లేఔట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్ధీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యమైన భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్లకూ అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని చెప్పారు. పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్‌ ఇస్తే మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని అన్నారు.


ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌లోని గోషామహాల్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న ఉస్మానియా కొత్త ఆస్పత్రిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఆస్పత్రికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించామని, ఈ నెల 27 వరకు గడువు పెట్టామని అధికారులు చెప్పారు. ఆస్పత్రి అవసరాలకు సౌర విద్యుత్తును వినియోగించేలా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అవసరమైన మేరకు సౌర విద్యుత్తు ఏర్పాటు చేయాలని, కేవలం భవనం పైభాగంలో మాత్రమే కాకుండా.. ఆస్పత్రి పరిధిలో ఉన్న నాలాపై కూడా సౌర పలకలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, జలమండలి అధికారులతోనూ సీఎం సమీక్ష నిర్వహించారు. వానాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్‌ వాఽ్యధులు, వాటి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రజారోగ్య శాఖ అధికారులతో రేవంత్‌ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో పలు కీలక సూచనలు చేసినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 03:07 AM