Nirmal: బుద్ధుడి విగ్రహం ఏర్పాటుపై వివాదం
ABN , Publish Date - May 13 , 2025 | 05:59 AM
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాంశివారులో సోమవారం బుద్ధుడి విగ్రహం ఏర్పాటు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. హనుమాన్ విగ్రహ సమీపంలో బుద్ధుడి విగ్రహాన్ని ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చే శారంటూ గ్రామానికి చెందిన పలువురు ఆందోళనకు దిగారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాంలో ఉద్రిక్తత
ముథోల్, మే 12 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాంశివారులో సోమవారం బుద్ధుడి విగ్రహం ఏర్పాటు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. హనుమాన్ విగ్రహ సమీపంలో బుద్ధుడి విగ్రహాన్ని ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చే శారంటూ గ్రామానికి చెందిన పలువురు ఆందోళనకు దిగారు. మరో వర్గం యువకులు తాము బుద్ధుడి విగ్రహాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడిచేసుకున్నారు. దీంతో పలువురు యువకులకు గాయాలయ్యాయి.
ఉద్రిక్త నెలకొనడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్, ఆర్డీవో కోమల్రెడ్డి భారీ పోలీసు బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ ఇరు వర్గాలను సముదాయించారు. ఆ తర్వాత ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించి ముథోల్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ వివాదానికి కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.