Share News

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌లో సీఐడీ దూకుడు

ABN , Publish Date - May 31 , 2025 | 03:50 AM

వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. కొన్నిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ యాప్స్‌, మాడ్యూల్స్‌ తయారీ ప్రక్రియలో రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహరించిన 30 మంది అధికారులపై సీఐడీ విచారణ చేపట్టింది.

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌లో సీఐడీ దూకుడు

  • యాప్స్‌, మాడ్యూల్స్‌ తయారీలో రిసోర్స్‌

  • పర్సన్లుగా ఉన్న అధికారులపై దృష్టి

  • 30 మందికి విచారణ కోసం పిలుపు

  • ఇప్పటికే 20 మంది విచారణ పూర్తి

  • నేడు మిగతావారి వంతు

  • వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌లో మాడ్యూల్‌ను మాయం చేయడంపై ఆరా

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. కొన్నిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ యాప్స్‌, మాడ్యూల్స్‌ తయారీ ప్రక్రియలో రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహరించిన 30 మంది అధికారులపై సీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే 20 మంది అధికారులను పిలిచి ప్రశ్నించగా.. శనివారం మరో 10 మందిని విచారించనుంది. ఈకేసులో అప్పటి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సీఐడీ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.


రూ.1,400 కోట్ల కుంభకోణం!

కొందరు డీలర్లు ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా, అమ్మినట్టుగా నకిలీ బిల్లులు (ట్యాక్స్‌ ఇన్వాయిస్‌) సృష్టించి.. ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందినట్టు రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనరేట్‌ గుర్తించిన సంగతి తెలిసిందే. మరో వ్యవహారంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లను తయారు చేయకపోయినా... తయారు చేసి, అమ్మినట్టు రిటర్నులు దాఖలు చేసి భారీగా ఐటీసీ పొందారు. ఇలా జీఎస్టీలో వివిధ మోసాలకు సంబంధించి రూ.1,400 కోట్లకుపైగా కుంభకోణం జరిగినట్టు అప్పట్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. మరోవైపు పన్నుల ఎగవేత, తక్కువ పన్ను చెల్లింపు, దొంగ ఇన్వాయి్‌సలతో ఐటీసీ కొల్లగొట్టడం తదితర అక్రమాలను తేల్చడానికి ప్రభుత్వం అప్పటి వాణిజ్య పన్నుల రాష్ట్ర కమిషనర్‌ టీకే శ్రీదేవి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. మోసాలకు పాల్పడిన 75 కంపెనీల్లో ఇప్పటివరకు 40 కంపెనీల వివరాలను ఆ కమిటీ సేకరించినట్టు తెలిసింది.


అక్రమాలు దొరక్కుండా ‘మాస్క్‌’..

ఒక రాష్ట్రంలోని డీలర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీ వసూలు చేస్తారు. ఇందులో కేంద్రానికి, వస్తువులను కొనుగోలు చేసిన రాష్ట్రానికి చెరో 50శాతం సొమ్ము వెళుతుంది. దీనినీ అక్రమాలకు వాడుకున్నారు. రాష్ట్రంలోని కొందరు డీలర్లు.. ఇతర రాష్ట్రాల డీలర్లకు ఇనుము, ఇత్తడి, రాగి స్ర్కాప్‌ వంటివి విక్రయించినట్లు నకిలీ ట్యాక్స్‌ ఇన్వాయి్‌సలను సృష్టించారు. ఈ ఇన్వాయి్‌సల ఆధారంగా ఆయా రాష్ట్రాల డీలర్లు అక్కడి ప్రభుత్వం నుంచి ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ పొందారు. ఈ సొమ్మును ఇక్కడి, అక్కడి డీలర్లు కలిసి పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిజానికి జీఎస్టీ ఎగవేతలు, ఐటీసీ క్లెయిమ్‌లు, బకాయిలను గుర్తించడానికి ఐఐటీ-హైదరాబాద్‌తో ఒక సాఫ్ట్‌వేర్‌ను వాణిజ్య పన్నుల శాఖ అభివృద్ధి చేయించింది. అధికారులు ఇందులో ఐజీఎస్టీ ఎగవేతలు, ఐటీసీ క్లెయిమ్‌లను గుర్తించే స్ర్కూటినీ మాడ్యూల్‌ కనిపించకుండా(మాస్క్‌) చేసినట్టు బయటపడింది. అప్పటి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ‘స్పెషల్‌ ఇనీషియేటివ్స్‌’ వాట్సాప్‌ గ్రూపు ద్వారా ఇచ్చిన సందేశాల మేరకు.. అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్‌ శివరాంప్రసాద్‌, ఐఐటీ-హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు కలసి ఆ మాడ్యూల్‌ పనిచేయకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నలుగురితోపాటు సాఫ్ట్‌వేర్‌కు సాంకేతిక సహకారం అందించిన ప్లియాంటో టెక్నాలజీస్‌ సంస్థపై కేసు నమోదు చేశారు.


తాజాగా 30 మందిని విచారిస్తున్న సీఐడీ

ఐజీఎస్టీ, ఇతర పన్ను ఎగవేతల నిరోధానికి అవసరమైన యాప్స్‌, మాడ్యూల్స్‌ను ఐఐటీహెచ్‌తో అభివృద్ధి చేయించడంలో.. వాణిజ్య పన్నుల శాఖ తరఫున కొందరు అధికారులు రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహరించారు. వారిని కూడా ప్రశ్నిస్తే మరిన్ని అంశాలు బయటికి వస్తాయని భావించిన సీఐడీ అధికారులు.. తాజాగా 30మందిని విచారణకు పిలిచారు. అందులో పది మంది జాయింట్‌ కమిషనర్లు, 8 మంది డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు అసిస్టెంట్‌ కమిషనర్లు, నలుగురు స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు, ముగ్గురు డిప్యూటీ స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు ఉన్నారు. ఈ 30 మందిలో ఈ నెల 29న 10మందిని, 30న మరో 10 మందిని సీఐడీ అధికారులు విచారించారు. 31న (శనివారం) మిగతా వారిని విచారించనున్నారు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 03:50 AM