Kidney Transplantation: కిడ్నీ మార్పిడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:47 AM
రాష్ట్రంలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి తాజాగా ఇద్దరు కీలక నిందితులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి తాజాగా ఇద్దరు కీలక నిందితులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నిందితులు ప్రదీప్ కుమార్ గుప్తా, పవన్ కుమార్ను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశామని ఆమె చెప్పారు. హర్యానాలోని గుర్గావ్లో నివసించే ప్రదీప్ కుమార్ గుప్తా.. చంఢీగడ్, గుజరాత్, మహరాష్ట్రల్లో కిడ్నీ రోగులను గుర్తించేవాడన్నారు. వారికి తక్కువ ధరకే ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తామని నమ్మించి, హైదరాబాద్కు తీసుకుని వచ్చేవాడని చెప్పారు.
ఇక పవన్ కుమార్ తమిళనాడు నుంచి కిడ్నీ దాతలను రప్పించి.. వారికి ఇక్కడి వివిధ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయించేవారని ఆమె వివ రించారు. కిడ్నీ గ్రహీతల నుంచి నిందితులు రూ. 30 లక్షలు వసూలు చేసి.. చెరో రూ. 10 లక్షలు తీసుకునేవారని చారు సిన్హా తెలిపారు. ఇప్పటి వరకు ప్రదీప్ పది మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించాడని, వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవాడని ఆమె అన్నారు.