Share News

ప్రేమ జంట ఆత్మహత్య..

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:19 AM

ఇద్దరిదీ ఒకే వీధి కావడంతో చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు.. తర్వాత స్నేహం ప్రేమగా మారింది.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

ప్రేమ జంట ఆత్మహత్య..

  • వివాహానికి పెద్దలు నిరాకరించటంతో మనస్తాపం

  • భువనగిరిలో రైలు కిందపడి బలవన్మరణం

  • మృతులు జనగామ జిల్లా వాసులుగా గుర్తింపు

స్టేషన్‌ఘన్‌పూర్‌ / భువనగిరి రూరల్‌ జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఇద్దరిదీ ఒకే వీధి కావడంతో చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు.. తర్వాత స్నేహం ప్రేమగా మారింది.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, పెద్దలు నిరాకరించడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భువనగిరి శివారులోని పగిడిపల్లి వద్ద జరిగింది. మృతులను జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నెమలిగొండకు చెందిన మచ్చ శృతి(23), కోటే వినయ్‌కుమార్‌(25)గా గుర్తించారు. వీరి రెండు కుటుంబాలు ఒకే వీధిలో నివాసముంటున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలోనే పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. బీటెక్‌ పూర్తి చేసిన శ్రుతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోండగా, వినయ్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.


ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో శ్రుతి తన ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు నిరాకరించడంతో విషయాన్ని వినయ్‌కు తెలిపింది. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వినయ్‌ ఆదివారం మధ్యా హ్నం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా పని మీద భువనగిరి వచ్చానని తెలిపాడు. భువనగిరి వద్ద కలుసుకున్న వినయ్‌, శృతి తమకు వివాహం కాదేమోనని భావించి, ఆదివారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పోలీసులు మృతుల వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడడంతో నమిలికొండలో విషాదం అలుముకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 05:19 AM