Tragic Incident: ఫ్యాన్కు టవల్ చుట్టి చిన్నారి ఆట..మెడకు చుట్టుకొని మృతి
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:09 AM
ఫ్యాన్కు టవల్ను చుట్టి ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని మృతి చెందింది.

సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో ఘటన
పటాన్చెరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఫ్యాన్కు టవల్ను చుట్టి ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని మృతి చెందింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో సోమవారం జరిగింది. చిట్కుల్కు చెందిన వడ్ల నర్సింహులు, లత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. సోమవారం తల్లిదండ్రులు జిన్నారం బీసీ హాస్టల్లో చదువుతున్న పెద్ద కుమార్తెను చూసేందుకు వెళ్లగా, ఇంట్లో చిన్న కూతురు సహస్ర (6), కుమారుడు గణేశ్ ఉన్నారు. వారికి తోడుగా వారి నాయనమ్మ ఉంది. విద్యుత్ పోవడంతో నాయనమ్మ బయట కూర్చోగా సహస్ర తమ్ముడితో కలిసి స్టూల్ వేసుకొని ఇంట్లోని ఫ్యాన్కు టవల్ను చుట్టి ఆడుకుంటోంది. ఈ క్రమంలో విద్యుత్ రావడంతో ఫ్యాన్ తిరిగింది. దాంతో టవల్ సహస్ర మెడకు బిగుసుకుపోయి ఊపిరాడక మృతి చెందింది. ఇంట్లోంచి అరుపులు వినిపించడంతో నాయనమ్మ వచ్చి ఫ్యాన్ ఆపు చేసి సహస్రను కిందకు దింపింది. అయితే అప్పటికే బాలిక మృతిచెందింది. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సహస్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
చిన్నమ్మే హంతకురాలు..
కోరుట్ల చిన్నారి హత్య కేసులో నిందితురాలి అరెస్టు.. రిమాండ్కు తరలింపు
కోరుట్ల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హితీక్ష (5) హత్య కేసు మిస్టరీ వీడింది. ఆ బాలికను చంపింది (బాబాయ్ భార్య) చిన్నమ్మ మమతేనని పోలీసులు నిర్ధారించారు. హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సోమవారం కోరుట్ల సీఐ సురేశ్ బాబు తెలిపారు. కోరుట్ల ఆదర్శనగర్లో ఐదేళ్ల బాలికను గొంతు కోసి చంపి పక్కింటి బాత్రూంలో పడవేసిన ఘటన శనివారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ డేటాను ఆధారంగా చేసుకొని ఆదివారమే మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ఆమెను విచారించగా.. నేరం అంగీకరించింది. తోడి కోడలు నవీనపై కోపంతోనే ఆమె కూతురు హితీక్షను మమత హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. హితీక్ష తండ్రి రామ్, బాబాయ్ లక్ష్మణ్, తాత మదన్ గల్ఫ్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లి వస్తుంటారని.. నవీన, మమత తమ పిల్లలతో అత్త వద్దే ఉండేవారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి