Padi Kaushik Reddy: పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:49 AM
గ్రానైట్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించిన ఆరోపణలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై సోమవారం కేసు నమోదైంది. సుబేదారి సీఐ పి.సత్యనారాయణరెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): గ్రానైట్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించిన ఆరోపణలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై సోమవారం కేసు నమోదైంది. సుబేదారి సీఐ పి.సత్యనారాయణరెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కట్టా మనోజ్రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తన భర్త మనోజ్రెడ్డిని బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని, మళ్లీ ఈ నెల 18న మనోజ్రెడ్డికి ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇవ్వాలని ఆయన భార్య ఉమాదేవి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డబ్బు ఇవ్వకపోతే తన నియోజకవర్గంలో ఉన్న గ్రానైట్ క్వారీ నడవనివ్వనని, కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించారని అందులో పేర్కొన్నారు. దీనితో మనోవేదనకు గురైన తన భర్త ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. తన భర్త మనోజ్రెడ్డికి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. గతంలో కౌశిక్రెడ్డికి, మనోజ్రెడ్డికి మధ్య పరిచయం ఉందని, ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.