Bhatti Vikramarka: పదేళ్లలో సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదు
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:45 AM
గత పదేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సర్కారు గిరిజనుల కోసం సబ్ప్లాన్ నిధులను ఏ మాత్రం ఖర్చు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.17,169కోట్లను కేటాయించామని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మేం వచ్చాక 17,169కోట్ల కేటాయింపు
గిరిజనుల హక్కులు కాపాడేలా నల్లమల్ల డిక్లరేషన్ ఇచ్చాం: భట్టి విక్రమార్క
గిరిజనుల హక్కులను రక్షించాలి: మీనాక్షి
కొత్తగూడెం, మే 31 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సర్కారు గిరిజనుల కోసం సబ్ప్లాన్ నిధులను ఏ మాత్రం ఖర్చు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.17,169కోట్లను కేటాయించామని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసానిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం ముగింపు సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వంలో సబ్ప్లాన్ నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గిరిజనుల అవసరాలేంటో తెలుసుకునేందుకు ఆ వర్గాలకు చెందిన నాయకులను ఒకచోట చేర్చి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర జల గిరిజన వికాస పథకం తీసుకొచ్చిందని వెల్లడించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నల్లమల్ల డిక్లరేషన్ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నాటరాజన్ మాట్లాడుతూ.. గిరిజనుల చట్టాలను, హక్కులను పరిరక్షించి వారిని అన్నిరంగాల్లో ముందు వరుసలో నిలపాలన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ పరిరక్షించినప్పుడే వారు అభివృద్ధిలో ముందుకు వెళ్తారని, దీనికోసం కాంగ్రెస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందన్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుని జీవనం సాగించేందుకు అడవి బిడ్డలకు ఆర్థికంగా చేయూతనందించాలనిసూచించారు. పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహే్షగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం రూ.కోట్లాది నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నాడు ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి సోనియాగాంధీ వరకు గిరిజనుల అభివృద్ధికోసం,వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
ప్రభుత్వ పనితీరుపై మీనాక్షి ఆరా
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ శనివారం పాల్వంచలోని జెన్కో అతిథిగృహంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ ఒక్కో ఎమ్మెల్యేతో వేర్వేరుగా మాట్లాడి.. వారి నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయా ఎమ్మెల్యేలు ప్రభుత్వ పని తీరు బాగానే ఉందని, రుణమాఫీ, రైతుబంధు పథకం అందరికీ అందలేదన్న వ్యతిరేకత కొంత ఉందని ఆమె వివరించినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News