BJP: పది రోజుల్లో బీజేపీ రాష్ట్ర కమిటీ..?!
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:55 AM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారం, పది రోజుల్లో ఖరారవుతుందని తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటు కోసం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకున్నదని సమాచారం.

సునీల్ బన్సల్, అభయ్పాటిల్ చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
కమిటీలో 20 మందికి చాన్స్
తుది దశకు చేరుకున్న కసరత్తు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారం, పది రోజుల్లో ఖరారవుతుందని తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటు కోసం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకున్నదని సమాచారం. కొత్త కమిటీలో చోటు దక్కని వారికి పార్టీ నాయకత్వం మరో కీలక బాధ్యత అప్పగిస్తుందని వినికిడి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీలో స్థానం సంపాదించుకునేందుకు ఆశావహులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి అభయ్ పాటిల్లతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, సంఘ్ ముఖ్యులను కలుసుకుని తమకు మ ద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
దాదాపు నెల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత రాంచందర్రావు.. గత నెలాఖరులోనే కొత్త కమిటీ ఏర్పాటవుతుందని ప్రకటించారు. సామాజిక, భౌగోళిక సమీకరణాలకనుగుణంగా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామన్న రాంచందర్ రావు.. పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి ఉంటారు.