Raghunandan Rao: ఆ భూములను హెచ్సీయూకు ఎందుకివ్వలేదు..?
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:24 AM
హెచ్సీయూ భూముల వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిసినా.. కేటీఆర్ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు.

పదేళ్లు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది కదా
కేటీఆర్కు ఎంపీ రఘునందన్ రావు సూటి ప్రశ్న
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): హెచ్సీయూ భూముల వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిసినా.. కేటీఆర్ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. హెచ్సీయూ పేరిట 2,185 ఎకరాలను బదలాయించాలని 2012లోనే రంగారెడ్డి కలెక్టర్, సీసీఎల్ఏకు నివేదించారని తెలిపారు. 2014 నుంచి పదేళ్లు అధికారంలో ఉన్నా, ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదో చెప్పాలని కేటీఆర్ను నిలదీశారు. ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీని కేంద్రం మంజూరు చేస్తే, వెంటనే దాని పేరిట అప్పటి కేసీఆర్ ప్రభుత్వం భూ బదలాయింపు చేసిందని గుర్తుచేశారు.
మరి సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో అలా ఎందుకు స్పందించలేదని కేటీఆర్ను నిలదీశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ మీడియాతో చిట్చాట్ చేశారు. ‘‘నేను రేవంత్ను కాపాడుతున్నానని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరి ఢిల్లీలో ఒకాయనను కొట్టిన కేసులో హరీశ్కు వకాలత్ చేసిన సంగతి మరచిపోయారా..? అప్పుడు మిమ్మల్ని కాపాడలేదా..?’’ అని కేటీఆర్ను ప్రశ్నించారు. హెచ్సీయూకు భూమి బదలాయింపునకు సంబంధించిన గెజిట్ను సుప్రీంకోర్టు సాధికారత కమిటీకి తానే అందజేశానని రఘునందన్ తెలిపారు.