BJP MP Lakshman: రేవంత్ మా స్కూల్ డ్రాపవుట్
ABN , Publish Date - Jun 10 , 2025 | 07:07 AM
సీఎం రేవంత్రెడ్డి తమ స్కూల్ డ్రాపవుట్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం జాతీయ భావంతో పనిచేసే ఆలోచనా విధానాన్ని మా స్కూల్లో నేర్పిస్తారు. కానీ ఆ విధానంలో రేవంత్ దారితప్పారు

ఆయన దారి తప్పి ఎక్కడో కొలువులో చేరారు
రాష్ట్ర గౌరవాన్ని రాహుల్ వద్ద తాకట్టు పెట్టారు: లక్ష్మణ్
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డి తమ స్కూల్ డ్రాపవుట్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం జాతీయ భావంతో పనిచేసే ఆలోచనా విధానాన్ని మా స్కూల్లో నేర్పిస్తారు. కానీ ఆ విధానంలో రేవంత్ దారితప్పారు. ఎక్కడో కొలువులో చేరడం వల్ల స్కూల్లో చదివిన మూలాలు పోయాయి. ఆయన మా స్కూల్లోనే చదివి ఉంటే మరోస్థాయికి ఎదిగేవారు’’ అని అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఏ పదవిలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదని, ప్రజలు హర్షించేలా ఉండడం ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన, సీఎం రేవంత్ 18 నెలల పాలనను బేరీజు వేస్తే రేవంత్ పాలన ఎలా ఉందో తెలుస్తుందని అన్నారు. రేవంత్కు రాహుల్ జపం తప్ప మరొకటి లేదని విమర్శించారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోస్తున్నారుగానీ రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేదని విమర్శించారు. అవినీతిలో తెలంగాణ దూసుకుపోతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిని రాహుల్ గాంధీ వద్ద తాకట్టుపెట్టి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేవంత్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.