Ponguleti Srinivas Reddy: భూ భారతి చట్టం.. రైతుల ఇంటి చుట్టం
ABN , Publish Date - May 21 , 2025 | 04:41 AM
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. ఆగస్టు 15లోపు అన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

భూముల గట్టు పంచాయితీలకు త్వరలో పరిష్కారం..
ఆగస్టు 15 లోపు జటిలమైన భూసమస్యలు పరిష్కరిస్తాం
27న రాష్ట్రవ్యాప్తంగా 6వేల మంది
సర్వేయర్ల ఎంపిక: మంత్రి పొంగులేటి
హుస్నాబాద్/మంచిర్యాల/పెద్దపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘భూ భారతి చట్టం.. రైతుల ఇంటి చుట్టం’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు. రైతులు తమ భూ వివాదాల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే భూ భారతి చట్టాన్ని తెచ్చామని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న జటిలమైన భూ సమస్యలను ఈ చట్టం ద్వారా వచ్చే ఆగస్టు 15లోపు పరిష్కరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులే రైతుల ఇళ్ల వద్దకు వచ్చి వారికి దరఖాస్తు ఫారం అందజేస్తారని పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామాల్లో, మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో భూ భూరతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలుచోట్ల నెలకొన్న ప్రభుత్వ, అటవీ, ప్రైవేటు భూముల గట్టు పంచాయితీలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, ఆ భూములను సాగు చేసుకుంటున్న వారసుల్లో అర్హులకు సీఎం రేవంత్రెడ్డి త్వరలో పట్టాలు పంపిణీ చేస్తారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎలిగేడు మండలంలో వచ్చిన 1054 భూ సమస్య దరఖాస్తుల్లో కొన్నింటిని పరిష్కరించామని, మిగతా వాటిని జూన్ 2 లోపు పరిష్కరిస్తామని అన్నారు. 2020లో నాటి సర్కారు తెచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాలకు పరిష్కారం చూపకుండానే 9.20 లక్షల దరఖాస్తులను స్వీకరించారని, ఈ అంశం ప్రస్తుతం కోర్టుల్లో ఉందని చెప్పారు.
భూములకు భూధార్ కార్డులు..
ఆధార్ లాగా, భూములకు భూధార్ కార్డు ఇస్తామని, ఈ నంబర్తో ఆన్లైన్లో రైతులు తమ భూముల వివరాలు చూసుకోవచ్చని మంత్రి పొంగులేటి అన్నారు. సర్వే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి ఆ మ్యాపులను పాస్ బుక్లో జోడిస్తామన్నారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి, వారికి మూడు నెలల శిక్షణ ఇస్తామని, ప్రతి మండలానికి 8 మందికి తగ్గకుండా నియమిస్తామని చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తికమక అవుతూ సర్కారును బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు హుస్నాబాద్ మినీ స్టేడియంలోని హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగిన సందర్భంగా మంత్రి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి చట్టం అమలుకు తహసీల్దార్ స్థాయి సదస్సులు జరుగుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ నెలాఖరులోపు మొదటి దశలో 4.50 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.