Bhatti Vikramarka: దొంగల్లా దోచుకొని దయ్యాల్లా వికటాట్టహాసం
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:50 AM
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే గాడినపడుతోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయింది..
ఏడాది తిరగకముందే అన్యాయం జరిగిపోయినట్టు గత పాలకుల మాటలు
అన్యాయం జరిగింది ప్రజలకా? మీ కుటుంబానికా? కేసీఆర్..
పదేళ్లలో పాలమూరులో ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు: భట్టి
మహబూబ్నగర్, జూన్ 6 ( ఆంధ్రజ్యోతి ): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే గాడినపడుతోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన గత పాలకులు ఏడాది తిరగకముందే అన్యాయం జరిగిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ‘అన్యాయం జరిగింది? ప్రజలకా? మీకా.. మీ కుటుంబానికా?’ అని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ప్రజలకు ఏమీ చేయకపోగా రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకొని దయ్యాల్లా వికటాట్టహాసం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి 12 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగసభలో భట్టి మాట్లాడారు. పదేళ్లలో పాలమూరులో ఒక్క ఎకరాకూ నీరివ్వలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్ హయాంలో మంచి జరుగుతుంటే చూసి సంతోషించాలన్నారు. దోపిడీకి పాల్పడకుండా రాష్ట్ర సంపదను ప్రజలకే పంచుతున్నామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో గతంలో గిరిజనులు, ఆదివాసులకు 6.70 లక్షల ఎకరాలను పంచితే పదేళ్ల పాలనలో ఆ భూముల సాగుకు కరెంట్ ఇవ్వలేదని, రైతులే బోర్లు వేసుకొని పంటలు పండించినా వాటిని అమ్ముకునే పరిస్థితిలేకుండా బుల్డోజర్లతో తొక్కించారన్నారు. మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరా సౌర గిరి జల వికాసంతో ఆ 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు రూ.12,500 కోట్లతో సోలార్ పవర్ పంపు సెట్లు ఏర్పాటు చేయించి ఉద్యానవ న పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక దుర్భర పరిస్థితులున్నా గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను తొలగించకుండా కొనసాగిస్తూనే ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, ఇందిరా సౌర గిరి జల వికాసంతోపాటు రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో అభివృద్ధిలో తెలంగాణ దేశంలోని రాష్ట్రాలతోకాకుండా ప్రపంచంతో పోటీపడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ 17 నెలల కాంగ్రెస్ పాలనను చూస్తుంటే దుఃఖం వస్తోందనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘నీ దుఃఖం అధికారం పోయిందనా, ప్రజల కోసమా’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 65 ఏళ్లు 22 మంది ముఖ్యమంత్రులు పాలించి రూ.65 వేల కోట్ల అప్పుచేస్తే ఒక్క కేసీఆర్ పదేళ్లలో రూ.7.30 లక్షల కోట్ల అప్పుచేశారన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు నెలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కడుతోందని, లేకుంటే కాంగ్రెస్ చెప్పిన హామీల అమలుకుసమస్యే ఉండేది కాదన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో రూ.15 కోట్లు ఉంటే.. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయని, ఎంతలా దోపిడీ చేయకపోతే అంత డబ్బు ఖాతాలో ఉంటుందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, మేఘారెడ్డి పాల్గొన్నారు.