Online Gambling: బెట్టింగ్ యాప్ కేసుల మూలాల్లోకి సిట్
ABN , Publish Date - May 14 , 2025 | 03:10 AM
బెట్టింగ్ యాప్ కేసులపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. విదేశాల నుంచి ఈ యాప్లు ఆచరణలో ఉన్న కారణంగా, అక్కడి ప్రభుత్వాలకు లేఖలు రాసి విచారణ ప్రారంభించారు.

పలు దేశాలకు లేఖలు
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్ కేసుల దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు.. ఆయా బెట్టింగ్ కంపెనీల మూలాలపై దృష్టి సారించారు. బెట్టింగ్ కంపెనీలు విదేశాల నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో ఆయా దేశాలకు సిట్ అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో నమోదైన బెట్టింగ్ యాప్ కేసుల్లోంచి సిట్ అధికారులు నాలుగు కేసులను ఎంపిక చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయా సంస్థల మూలాలపై దృష్టి సారించారు. ఏ చట్టాల ప్రకారం ఆ యాప్లను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు ? డబ్బు బదిలీ ఏ విధంగా జరిగింది? సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు డబ్బు ఏ విధంగా చెల్లించారు? వారి మధ్య జరిగిన ఒప్పందాల్లో ఏముంది ? అనధికారికంగా డబ్బు చలామణి జరిగిందా? అనే కోణాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఆన్లైన్ బెట్టింగ్పై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ... సదరు యాప్లు రాష్ట్రంలో ఎలా పని చేశాయి అనే అంశంపై కూడా సిట్ సమాచారం సేకరిస్తోంది. మరోపక్క ఆన్లైన్ క్రికెట్, రమ్మీ.. స్కిల్ గేమ్స్ అని, అవి మేధస్సు ఉపయోగించి ఆడుతున్నారని, రమ్మీ స్కిల్ గేమ్ అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూపెట్టి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు న్యాయపరమైన ఊరట పొందడంతో పాటు సిట్ దర్యాప్తును అడ్డుకోవడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం. బెట్టింగ్ యాప్ల దందాను అడ్డుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యచరణ అవసరమని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్పై దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిబంధనలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఒకటే విఽధానం ఉంటేనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను కట్టడి చేయడం సులభం అవుతుందని అంటున్నారు.