Share News

Bandi Sanjay: గద్దర్‌కు ‘పద్మ’ అవార్డు.. పక్కా ఇయ్యం

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:36 AM

నక్సల్‌ భావజాలం ఉన్న గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్‌కౌంటర్‌ పేరుతో మర్డర్‌ జేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Bandi Sanjay: గద్దర్‌కు ‘పద్మ’ అవార్డు.. పక్కా ఇయ్యం

  • మా కార్యకర్తలను చంపితే పాటలు పాడాడు.. పోలీసులను మర్డర్‌ చేసిండు

  • ఆయన పేరెలా పంపుతారు?.. నక్సల్‌ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం?

  • రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊర్కోం: బండి సంజయ్‌

  • కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిర, లాడెన్‌, దావూద్‌ పేర్లు పెట్టుకోవాలని వ్యాఖ్య

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): నక్సల్‌ భావజాలం ఉన్న గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్‌కౌంటర్‌ పేరుతో మర్డర్‌ జేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సోమవారం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సంజయ్‌.. గద్దర్‌కు పద్మ పురస్కారం ప్రకటించకపోవడంపై ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు తీవ్రంగా స్పందించారు. ‘‘ఎట్లిస్తామన్నా.. గద్దర్‌కు ఎట్లిస్తాం చెప్పండి? ఆయన భావజాలమేంది? ఎంత మంది భారతీయ జనతాపార్టీ కార్యకర్తలను మర్డర్‌జేయించిన వ్యక్తి ఆయన? ఎట్లిస్తాం? పక్కా ఇయ్యం. మా కార్యకర్తలను చంపితే పాటలుపాడిన వ్యక్తి గద్దర్‌. మీరు పంపితే ఇస్తామా ఏంది అవార్డ్స్‌? భయపడే ప్రసక్తే లేదు. వెనక్కిపోయే ప్రసక్తే లేదు. వందలమంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ఆందోళన చేస్తుంటే.. నక్సల్స్‌ భావజాలం ఉన్న గద్దర్‌ మా కార్యకర్తలను హత్య చేయించిండు.


ఎన్‌ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్‌గారి మీద. అనేకమందిని పోలీసులను ఎన్‌కౌంటర్‌ పేరుతో మర్డర్‌ జేసిండు. అటువంటి వ్యక్తి పేరును ఏ విధంగా పంపుతారు?’’ అని గట్టిగా ప్రశ్నించారు. నక్సల్‌ భావజాలమున్న నాయకులు బీజేపీలో ఉన్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారని.. ఎంపీ ఈటల రాజేందర్‌నుద్దేశించి కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యపైనా సంజయ్‌ స్పందించారు. ‘‘ఈటల రాజేందర్‌కు వామపక్ష భావజాలం ఉండవచ్చు.. కానీ ఆయన నక్సలైట్‌ కాదు’’ అని స్పష్టం చేశారు. నక్సలైట్లు కాంగ్రెస్‌, టీడీపీ నాయకులను కూడా హత్యచేసిన సంగతి మరచిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే గద్దర్‌ అవార్డులను తమ పార్టీవారు తీసుకోబోరని సంజయ్‌ ప్రకటించారు. ఏపీకి 5 పద్మ పురస్కారాలు వచ్చాయి కదా? అని విలేకరులు ప్రశ్నించబోగా.. ‘‘పోయినసారి తెలంగాణకు పొట్టుపొట్టు వచ్చినయ్‌. అప్పుడేమన్నారు వారప్పుడు?’’ అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే ఆలోచన ఎప్పుడూ ఉండదని.. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఆ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు.


ఆ పేర్లు పెట్టాల్సిందే..

కేంద్ర పథకాల పేర్ల మార్పునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాల పేర్లే మార్చేస్తోందని.. అలా మార్చితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, గరీబ్‌ కళ్యాణ్‌ యోజన వంటి సంక్షేమ పథకాల పేర్లను మార్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే వాటిని నేరుగా లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కేంద్రం సీరియ్‌సగా పరిశీలిస్తోందని.. ఆ పరిస్థితి కొనితెచ్చుకోవద్దని.. రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ‘‘మీ నిధులతో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారో, ఒసామా బిన్‌ లాడెన్‌, దావూద్‌ ఇబ్రహీం వంటివారి పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి.. మాకేం అభ్యంతరం లేదు. కానీ, కేంద్ర సంక్షేమ పథకాలకు పేర్లు మారుస్తామంటే ఊరుకోం’’ అని హెచ్చరించారు.


‘‘రేషన్‌కార్డులు, ఉచిత బియ్యం కేంద్రం ఇస్తుంటే మీ ఫోటో పెట్టుకుంటారా? ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌యోజన అని రేషన్‌కార్డుపై ఉంటే.. ఇందిరమ్మ ఇళ్లపె పీఎం ఆవాస్‌ యోజన అని పెడితే ఇబ్బంది ఏంటి?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి పేరు రావొద్దన్నదే కాంగ్రెస్‌ ఆలోచన అని మండిపడ్డారు. రిపబ్లిక్‌ డే నాడు నాలుగు పథకాలపై ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని విమర్శించారు. ‘‘అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని మీరు చేసిన ప్రకటన వాస్తవం కాదా? మరి ఒక మండలంలో ఒక గ్రామంలోనే అర్హులున్నరా? ఒకటే గ్రామంలో రైతు భరోసాకు అర్హులున్నరా? మిగతా గ్రామాల ప్రజలు ఓట్లేయలేదా? ఇదేమైనా పైలట్‌ ప్రాజెక్టా?’’ అని నిలదీశారు. రేషన్‌ కార్డుల జారీ, రైతుభరోసా అమలులో రాష్ట్ర ప్రభుత్వం దారుణ మోసం చేసిందని దుయ్యబట్టారు. వర్సిటీలపై కేంద్రం పెత్తనం చేస్తోందంటూ సీఎం రేవంత్‌ చేసిన ఆరోపణపైనా ఆయన స్పందించారు. ప్రజలకు ఏది న్యాయమో, దేశానికి ఏది అవసరమో అదే చేస్తామని.. దానిని ఇంకొకరు విమర్శిస్తే పట్టించుకోబోమని తేల్చిచెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 04:36 AM