Share News

Ponguleti: సంపన్నుల చేతుల్లో అసైన్డ్‌ భూములుంటే స్వాధీనమే

ABN , Publish Date - May 31 , 2025 | 05:00 AM

పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు బడాబాబుల చేతుల్లో ఉంటే, వాటిని స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Ponguleti: సంపన్నుల చేతుల్లో అసైన్డ్‌ భూములుంటే స్వాధీనమే

  • పేదల అసైన్డ్‌ భూములను వారసులకు

  • బదిలీ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాం

  • 3 నుంచి 18 వరకు రెవెన్యూ సదస్సులు

  • కవిత వివాదం టీ కప్పులో తుఫానే: పొంగులేటి

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు బడాబాబుల చేతుల్లో ఉంటే, వాటిని స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అసైన్డ్‌ భూముల హక్కులను తండ్రి నుంచి వారసులకు బదిలీ చేసే అవకాశం గతంలో లేదని.. భూభారతి చట్టం కింద ఆ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇవే భూములను పేదలు కొనుగోలు చేసి ఉంటే వారికీ హక్కులు కల్పిస్తామన్నారు. ధనవంతుల చేతుల్లో ఉంటే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. తొలి విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించిననాలుగు మండలాల్లో 13వేల దరఖాస్తులు వచ్చాయనిచెప్పారు. చట్టబద్ధంగా పరిష్కరించగల అంశాలను పరిష్కరించామని, తిరస్కరించిన దరఖాస్తులకు ఎందుకు తిరస్కరించామనే వివరణ కూడా ఇచ్చామని తెలిపారు. సాదాబైనామా కింద ఆన్‌లైన్‌లో 9.26లక్షల దరఖాస్తులు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టులో స్టే ఉందని, దాన్ని ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


రెవెన్యూ సదస్సుల్లోనూ అత్యధికంగా సాదాబైనామా దరఖా స్తులే వస్తున్నాయన్నారు. ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలనీ దరఖాస్తులొచ్చాయని, అలాంటి వాటిని ఆమోదించబోమని స్పష్టంచేశారు. రెండో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించిన 28 మండలాల్లో 46వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిలో 21 శాతం దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. సర్వే నంబరు ఒకచోట, భూమి మరోచోట ఉన్న రైతులకు వారి సర్వే నంబర్లలో ఉన్న భూ మార్పిడికి అవకాశం కల్పించామని చెప్పారు. ధరణిలో సక్రమంగా చేసి ఉంటే ఇవాళ ఇన్ని దరఖాస్తులు వచ్చేవి కావన్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన 2.10లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటిదాకా రూ.135కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. కేటీఆర్‌ను తన నియోజకవర్గంలోని లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని కోరితే ఇవ్వలేదన్నారు. మురికివాడల్లో ఉం డే పేదల కోసం కోర్‌అర్బన్‌, అర్బన్‌ ప్రాంతాల్లో జీ+4 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలో 16మురికివాడలను గుర్తించామన్నారు. పేదలు నివాసం ఉండే చోటు ప్రభుత్వ స్థలమైతే అక్కడే నిర్మాణాలు చేయిస్తామని, ప్రయోగాత్మకంగా 10మురికివాడల్లో చేపడతామని తెలిపారు.


3 నుంచి రెవెన్యూ సదస్సులు

జూన్‌ 3 నుంచి18 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పొంగులేటి చెప్పారు. సర్వే శాఖను బలోపేతం చేస్తున్నామని, త్వరలో 700మంది రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించనున్నామని తెలిపారు. 7000 మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరికి పరీక్ష పెడతామని, ఉత్తీర్ణలైన వారికి లైసెన్స్‌ సర్వేయర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. గ్రామపాలనాధికారుల పరీక్షలో 3550మంది ఉత్తీర్ణులయ్యారని,2లోపు వారికి నియామక ఉత్తర్వులిస్తామని వెల్లడించారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించే ఏజెన్సీ ఎంపికలో జాప్యం జరిగిందని, వారంలోగా దీనిపై ఉత్తర్వులిస్తామన్నారు. త్వరలోనే భూబకాసురుల పనిపడతామని చెప్పారు. జీవో59 ముసుగులో పుప్పాలగూడ, శేర్‌లింగంపల్లి ప్రాంతాల్లో 9-10ఎకరాల భూములను 999గజాల చొప్పున విడగొట్టి, బినామీల పేరుతో విక్రయంచేశారని తెలిపారు.


బీఆర్‌ఎస్‌ నేతల బుద్ధి మారలేదు

కాళేశ్వరం విషయంలో రోజూ మీడియా ముందు అబద్ధాలు చెప్పి, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓడించిన తర్వాత కూడా వారి బుద్ధి మారలేదన్నారు. తాము కక్ష సాధింపులకు పాల్పడాలనుకుంటే తొలి ముద్దాయిగా కేసీఆర్‌నే పిలిచేలా కమిషన్‌పై ఒత్తిడి చేసేవాళ్లమని చెప్పారు. ఎల్‌అండ్‌టీ సంస్థ కూడా ఒక ముద్దాయే అని, ఆ సంస్థ ఇచ్చిన నివేదికను అడ్డు పెట్టుకుని ఓ పత్రికలో క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు రాసుకున్నారని చెప్పారు. కమిషన్‌ ముందు కేసీఆర్‌ పీపీటీ ఇస్తున్నారని ప్రస్తావించగా.. ఆయనలో ఉన్న శిల్పి గురించి ప్రజెంటేషన్‌ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. కవితకు మంత్రి పదవి ఇస్తున్నారా? ఏ చాంబర్‌ కేటాయిస్తారు? వంటి విషయాలు మాట్లాడే స్థాయి తనకు లేదని చెప్పారు. కవిత వివాదం టీ కప్పులో తుఫాన్‌ లాంటిందని పేర్కొన్నారు. ఎవరి మీద పోరాటం చేస్తోందనేది కవిత చెబుతుందని తానూ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. పూర్తికాలం రేవంత్‌రెడ్డే సీఎంగా కొనసాగుతారని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. రాహుల్‌ గాంధీతో అర్ధరాత్రి కూడా మాట్లాడేంత చనువు రేవంత్‌కు ఉందన్నారు. ఈడీ తన ఇంట్లో సోదాలు చేయలేదని.. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తన కుమార్తె ఉన్న ఇంటిపైనే ఈడీ సోదాలు చేసిందని చెప్పారు. క్యాబినెట్‌ విస్తరణపై విలేకరులు ప్రస్తావించగా.. త్వరలోనే జరుగుతుందన్నారు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 05:00 AM