నకిలీ వీడియోలు పోస్ట్ చేయలేదు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:27 AM
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నకిలీ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఈ అంశంపై బాలీవుడ్ నటి దియామీర్జా స్పందించారు.

తెలంగాణ సీఎం వాస్తవాలు తెలుసుకోవాలి
రేవంత్ ట్వీట్కు నటి దియా మీర్జా స్పందన
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నకిలీ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఈ అంశంపై బాలీవుడ్ నటి దియామీర్జా స్పందించారు. తాను ఎలాంటి నకిలీ వీడియోలు, ఫొటోలు షేర్ చేయలేదని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ‘‘కంచ గచ్చిబౌలికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న (ఆదివారం) ఒక ట్వీట్లో పలు ఆరోపణలు చేశారు.
అందులో.. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తున్న 400 ఎకరాల భూములను కాపాడాలంటూ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నేను ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశానని ఆరోపించారు. కానీ, ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ. నేను ఒక్కటి కూడా ఏఐతో రూపొందించిన ఫొటోగానీ, వీడియో గానీ పోస్ట్ చేయలేదు. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు తెలంగాణ ప్రభుత్వం, మీడియా వాస్తవాలు చెక్ చేసుకోవాలి’’ అని దియామీర్జా ట్వీట్ చేశారు. ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.