Mahesh Babu: మహేశ్బాబుకు వినియోగదారుల ఫోరం నోటీసు
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:56 AM
సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన నటుడు మహే్షబాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది.

సాయిసూర్య డెవలపర్స్కు ప్రచారకర్తగా ఉన్న నటుడు
లేని వెంచర్లో ప్లాట్లు విక్రయించినట్టు పలువురి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన నటుడు మహే్షబాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. సదరు సంస్థ నిర్వాహకులు లేఔట్లో అన్ని అనుమతులున్నాయని ప్రచారం చేసుకున్నారని, మహే్షబాబు ఫొటో ఉన్న బ్రోచర్లోని వెంచర్లో ఉన్న ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాటు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలితోపాటు మరో వ్యక్తి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చె రొక ప్లాటు కొనుగోలుకు రూ.34.80 లక్షల చొప్పున చెల్లించామన్నారు. తర్వాత అసలు లేఔట్ కూడా లేదని తెలుసుకొని తమ డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా పలు వాయిదాల్లో చెరి రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారని బాధితులు పేర్కొన్నారు.
మహే్షబాబు ఫొటో ఉన్న బ్రోచర్ను చూపుతూ లేని వెంచర్లో ప్లాట్లను విక్రయించి సాయిసూర్య డెవలపర్స్ తమను మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాయిసూర్య డెవలపర్స్, సంస్థ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా, ప్రచారకర్తగా ఉన్న మహే్షబాబులను ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ప్రతివాదులు సోమవారం వ్యక్తిగతంగా గానీ న్యాయవాదుల ద్వారా గానీ హాజరుకావచ్చు.