Mudigonda: 45 మంది విద్యార్థినులకు అస్వస్థత
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:03 AM
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స
నల్లగొండ జిల్లా ముదిగొండ ఆశ్రమ పాఠశాలలో ఘటన
దేవరకొండ, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ముదిగొండ ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 10 తరగతుల వరకు మొత్తం 310 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్నాక్స్లో భాగంగా విద్యార్థినులకు వేయించిన బొబ్బర్లు పెట్టారు. రాత్రి ఏడు గంటలకు చికెన్, బగార అన్నం వడ్డించారు.
సోమవారం ఉదయం అల్పాహారంలో భాగంగా పులిహోర తిన్న కొంతమంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆశ్రమ సిబ్బందికి చెప్పారు. వసతిగృహంలో ఉన్న ఏఎన్ఎంలు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అస్వస్థత పాలైనవిద్యార్థినుల్లో 25 మందిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, 20 మందిని తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా వైద్యులు వెంటనే చికిత్స అందించారు. విద్యార్థినుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని దేవరకొండ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రకాష్ తెలిపారు.