Share News

IPL Qualifier Match: ఫైనల్‌కు ఎవరు? ఇంటికి ఎవరు?

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:10 AM

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు ఆహ్మదాబాద్‌లో జరుగుతుంది. గెలిచిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదురు ఫైనల్‌లో పోటీ చేస్తుంది.

IPL Qualifier Match: ఫైనల్‌కు ఎవరు? ఇంటికి ఎవరు?

  • ముంబైతో పంజాబ్‌ అమీతుమీ

  • నేడు క్వాలిఫయర్‌-2 పోరు

అహ్మదాబాద్‌: తాజా ఐపీఎల్‌ సీజన్‌ ముగింపు దశకు చేరింది. ఆదివారం క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు ఈనెల 3న జరిగే ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఎదుర్కొంటుంది. ఇక, ఇరుజట్లలోనూ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తుండడంతో అభిమానులు హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు. క్వాలిఫయర్‌1లో ఆర్‌సీబీ చేతిలో ఓడిన పంజాబ్‌కు ఫైనల్‌ చేరేందుకిది రెండో అవకాశం. ఐపీఎల్‌లో పంజాబ్‌ 2014లో తుది పోరుకు అర్హత సాధించింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత అదే ఫీట్‌ సాధించి తొలిసారి కప్‌ను ముద్దాడాలనే ఆశతో ఉంది. అటు ముంబై జట్టు ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్‌ బెర్త్‌పై కన్నేసింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై.. చివరిసారి 2020లో విజేత కాగలిగింది. లీగ్‌ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబే నెగ్గడంతో తాజా పోరులో హార్దిక్‌ సేన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.


ఒత్తిడి లేకుండా ఆడితేనే..

టేబుల్‌ టాపర్‌గా ప్లేఆ్‌ఫ్సలో అడుగుపెట్టిన పంజాబ్‌.. క్వాలిఫయర్‌-1లో మాత్రం ఆర్‌సీబీ చేతిలో పూర్తిగా చిత్తయ్యింది. హార్డ్‌ హిట్టర్లతో కూడిన కింగ్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కనీసం 100 పరుగులు చేసేందుకే కష్టపడాల్సి వచ్చింది. అటు బెంగళూరు పది ఓవర్లలోనే ఛేదనను పూర్తి చేయడం పంజాబ్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టయ్యింది. ఇప్పుడు ముంబై రూపంలో వారి ముందు అతిపెద్ద గండం ఉంది. అయితే కెప్టెన్‌ శ్రేయాస్‌, కోచ్‌ పాంటింగ్‌ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఏడుసార్లు 200+ స్కోర్లు సాధించింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ మెరుపు ఆరంభాన్నిస్తుండగా.. ఇన్‌గ్లిస, శ్రేయాస్‌, స్టొయినిస్‌, నేహల్‌, శశాంక్‌ రూపంలో బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. కానీ ముంబై బౌలింగ్‌ బలం ముందు వీరి నిలకడ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. పేసర్‌ జాన్సెన్‌ స్వదేశానికి వెళ్లడంతో అర్ష్‌దీప్‌ పైనే భారం పడనుంది. గత మూడు మ్యాచ్‌లకు దూరమైన స్పిన్నర్‌ చాహల్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.


జోష్‌లో హార్దిక్‌ సేన

ఆరంభంలో అపజయాలు ఎదురైనా ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ చాంపియన్స్‌ ఆటతీరును ప్రదర్శించింది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌‌కు దూసుకురాగలిగింది. ఇప్పుడు ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించిన జోష్‌లో పంజాబ్‌ను ఎదుర్కొనేందుకు ఉవ్విళ్లూరుతోంది. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో ఈ జట్టు ఎదురులేకుండా ఉంది. రోహిత్‌తో పాటు బెయిర్‌స్టో చెలరేగడం జట్టుకు శుభసూచకం. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, తిలక్‌, నమన్‌, హార్దిక్‌ ఎదురుదాడితో భారీ స్కోర్లు సాధించగలుగుతుంది. ఇక పేసర్‌ బుమ్రా జట్టు ప్రధాన ఆయుధంగా చెప్పవచ్చు. శుక్రవారం మ్యాచ్‌లో గుజరాత్‌ను సరైన సమయంలో దెబ్బతీసి తమ జట్టు విజయానికి బాట వేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు కూడా తనే ప్రమాదకారి అనడంలో సందేహం లేదు. ఇక బౌల్ట్‌ పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి వెన్నువిరుస్తున్నాడు. కొత్త పేసర్‌ గ్లీసన్‌ కూడా ఆకట్టుకోవడం జట్టుకు సానుకూలాంశం కానుంది.


పిచ్‌, వాతావరణం

ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరుసార్లు మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టే గెలిచింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 173గా ఉంది. పిచ్‌ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలించనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు (అంచనా)

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌, ఇన్‌గ్లిస్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, స్టొయినిస్‌, ఒమర్జాయ్‌, హర్‌ప్రీత్‌, జేమిసన్‌, చాహల్‌.

ముంబై: రోహిత్‌, బెయిర్‌స్టో, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), నమన్‌ ధిర్‌, శాంట్నర్‌, అశ్వని, గ్లీసన్‌, బుమ్రా, బౌల్ట్‌.

Updated Date - Jun 01 , 2025 | 02:21 AM