Gujarat Giants: రెజా రూ. 2.23 కోట్లుకు కొనుగోలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:43 AM
ఇరాన్ ఆల్రౌండర్ మహమ్మద్ రెజా రూ. 2.23 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకోగా, దేవాంక్ దలాల్ రూ. 2.20 కోట్లకు బెంగాల్ వారియర్స్కు చేరాడు.పవన్ షెహ్రవత్ కనీస ధరకు అమ్ముడవ్వగా, పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా మిగిలాడు.
ప్రొ కబడ్డీ వేలం
టాప్ లేపిన ఇరాన్ ఆల్రౌండర్
దేవాంక్కు రూ. 2.20 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ సీజన్-12 వేలంలో ఇరాన్ ఆల్రౌండర్ మహమ్మద్ రెజా టాప్ లేపాడు. శనివారం జరిగిన తొలిరోజు వేలంలో గుజరాత్ జెయింట్స్ భారీ ధర రూ. 2.23 కోట్లకు రెజాను కొనుగోలు చేసింది. అతడు వేలంలో 2 కోట్ల మార్క్ దాటడం ఇది వరుసగా మూడోసారి. కాగా, గత సీజన్ బెస్ట్ రైడర్ దేవాంక్ దలాల్ అత్యధికంగా రూ. 2.20 కోట్లకు అమ్ముడైన భారత ఆటగాడిగా నిలిచాడు. దేవాంక్ కోసం పుణె తీవ్రంగా పోటీపడినా.. భారీ ధరకు బెంగాల్ వారియర్స్ దక్కించుకొంది. అషు మాలిక్ను దబాంగ్ ఢిల్లీ ఫైనల్ బిడ్ టు మ్యాచ్ కింద రూ. 1.90 కోట్లకు తిరిగి దక్కించుకోగా.. రెయిడ్ మెషీన్ అర్జున్ దేశ్వాల్ను తమిళ్ తలైవాస్ రూ. 1.40 కోట్లకు ఖరీదు చేసింది. మొత్తంగా మొదటి రోజు వేలంలో 10 మంది ఆటగాళ్లు కోటికిపైగా ధరపలికారు. కాగా, ఇరాన్ స్టార్ డిఫెండర్ ఫజల్ అత్రాచెలిని కనీస ధర రూ. 30 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఇక, భారత జట్టు కెప్టెన్ పవన్ కుమార్ షెహ్రవత్పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అతడు అన్సోల్డ్గా మిగులుతాడనుకొన్న సమయంలో ఢిల్లీ, బెంగాల్ పోటీపడ్డాయి. కానీ, తమిళ్ తలైవాస్ రూ. 59.50 లక్షలకు సొంతం చేసుకొంది. డిఫెండర్ శుభం షిండేను తెలుగు టైటాన్స్ రూ. 80 లక్షలకు దక్కించుకొంది. కాగా, పట్నాకు మూడు వరుస టైటిళ్లు అందించిన పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా మిగలడం గమనార్హం.