WPL 2026: దీప్తి శర్మకు జాక్పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:48 PM
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడంలో పెద్ద హైడ్రామానే నడిచింది. దీప్తి కోసం ఢిల్లీ, యూపీ పోటీ పడగా.. ఆర్టీఎం కార్డ్ ద్వారా యూపీ రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026(WPL) మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా ఆల్రౌండర్, మహిళల ప్రపంచ కప్ టోర్నీలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మ కోసం పెద్ద హైడ్రామానే నడిచింది. తొలుత ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా.. ‘ఆర్టీఎమ్’ కార్డ్ ఉపయోగించి యూపీ ఏకంగా రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
గతేడాది జరిగిన డబ్ల్యూపీఎల్లో దీప్తి శర్మ(Deepti Sharma) యూపీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది. అయితే మెగా వేలానికి ముందు ఈ జట్టు దీప్తిని రిటైన్ చేసుకోలేదు. దీంతో గురువారం జరిగిన వేలంలో తొలి సెట్లో దీప్తి శర్మను కనీస ధర రూ.50లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది. ఆ సమయంలో యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ కార్డు అవకాశాన్ని వినియోగించుకుంది. ఈ కార్డ్ను యూపీ ఉపయోగించుకోగానే.. ఢిల్లీ తన బిడ్ను రూ.3.20కోట్లకు పెంచేసింది.
ఆ ధరకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ మళ్లీ పాత జట్టుకే వెళ్లిపోయింది. అంత మొత్తం వెచ్చించేందుకు యూపీ జట్టు వెనుకాడకపోవడంతో ఢిల్లీ క్యాంప్లో ఉన్న సౌరవ్ గంగూలీ ఆశ్చర్యపోయారు. ఈ ధరతో డబ్ల్యూపీఎల్లో ఇప్పటివరకు రెండో అత్యధిక ధర కలిగిన ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. గతంలో స్మృతి మంధానను బెంగళూరు జట్టు రూ.3.4కోట్లకు దక్కించుకుంది.
ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్ టోర్నీలో దీప్తి శర్మ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అటు బ్యాట్తోనూ.. ఇటు బంతితోనూ అదరగొట్టి ఫైనల్ పోరులో టీమ్ఇండియాకు కప్పు అందించడంలో కీలక పాత్ర పోషించింది. 215 పరుగులు, 22 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ