High Speed Bike Stunt: రీల్స్ పిచ్చి.. ప్రాణం తీసిన బైక్ స్టంట్..
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:53 PM
రీల్స్ పిచ్చికి మరో నిండు ప్రాణం బలైంది. ఓ యువకుడు బైక్ స్టంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది.
దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. మూడు రోజుల క్రితం ఒడిశాకు చెందిన ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. రీల్స్ పిచ్చికి మరో నిండు ప్రాణం బలైంది. ఓ యువకుడు బైక్ స్టంట్ (Himachal Bike Stunt) చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మండిలోని బల్హా ఏరియాకు చెందిన 22 ఏళ్ల అనికేత్ బీటెక్ చదువుతున్నాడు. శనివారం రాత్రి అతడు తన మిత్రుడితో కలిసి కిర్తాపూర్ - మనాలి ఫోర్ వే రోడ్డుపైకి వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ కోసం ఓ రీల్ (Dangerous Social Media Stunts) చేద్దామని ఫ్రెండ్ అనికేత్క్ చెప్పాడు. బైక్తో స్టంట్ చేయమని ప్రోత్సహించాడు. ప్రెండ్ ప్రోత్సాహంతో అనికేత్ తన బైకుతో స్టంట్ చేయటం మొదలెట్టాడు. బైకును అత్యంత వేగంగా నడపసాగాడు. ఈ నేపథ్యంలోనే అతడి బైక్ అదుపు తప్పింది. రోడ్డుపై పడి జారుకుంటూ వెళ్లిపోయింది. బైకు, రోడ్డుకు మధ్య రాపిడి జరిగి మంటలు సైతం పుట్టాయి.
కింద పడ్డ అనికేత్ మెడ ఠక్కున విరిగిపోయింది. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనికేత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అనికేత్ ఫ్రెండ్ దగ్గర ఉన్న వీడియోలు(Mandi District Bike Crash) బయటపడ్డాయి. అనికేత్ను ప్రోత్సహించి అతడి చావుకు కారణం అయ్యింది ఫ్రెండ్ అని ఆ వీడియోల ద్వారా వెల్లడైంది. పోలీసులు ఎఫ్ఐఆర్లో ఫ్రెండ్ను నిందితుడిగా చేర్చారు. అతడిపై చర్యలకు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి
దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఈ 3 పనులు 30 నిమిషాలు చేస్తే చాలు.!
చాదర్ఘాట్ కాల్పుల ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు