‘అల’రించే వంతెన..
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:32 AM
కనుచూపుమేర పచ్చందనం... అక్కడే రెండు సుందరమైన కొండలు... వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం... దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన...

కనుచూపుమేర పచ్చందనం... అక్కడే రెండు సుందరమైన కొండలు... వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం... దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన...
భారీ, విభిన్న నిర్మాణాలతో తరుచూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరో ఇంజనీరింగ్ అద్భుతం ‘రుయి’ బ్రిడ్జ్. దీనిని మూడేళ్ల పాటు నిర్మించి, 2020లో వంతెనపైకి పర్యాటకులను అనుమతించారు. చైనీస్ రుయి (అదృష్టానికి ప్రతీక) చిహ్నం ప్రేరణతో దీనిని నిర్మించారు. ఇది భూమి నుంచి 140 మీటర్లు(460 అడుగులు) ఎత్తులో ఉంటుంది. దీని పొడవు 100 మీటర్లు(330 అడుగులు). ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల మంది సందర్శించడం విశేషం. స్థానికులు ఈ వంతెనను ‘బెండింగ్ బ్రిడ్జ్’ అని పిలుస్తారు.
మెట్లూ ఉన్నాయి...
కళ్లు చెదిరే ఈ బ్రిడ్జ్ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో ఉంది. ఇదొక గాజు వంతెన. వంతెన నిర్మాణాల్లో విశేష అనుభవమున్న హీయున్చాంగ్ అనే ఇంజనీర్ దీనికి రూపకల్పన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే వంతెనను ఓచోట మూడు దారులుగా విభజించారు. ఇంకోచోట కలిపినట్లుగా ఉంటుంది. దీనిపై సులువుగా నడవటానికి మెట్లు కూడా ఉన్నాయి. సందర్శకులు వంతెనపై నడుస్తున్నంతసేపూ గాల్లో తేలుతున్నట్లు, మేఘాలు హాయ్ చెప్పుతున్నట్లు అనుభూతి చెందుతారట.
అందుకే పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు. వంతెనపై సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవారు ఎక్కువ. సందర్శకులు పెట్టే కామెంట్లు కూడా ‘రుయి’ క్రేజ్కు ఓ కారణంగా చెబుతారు. ‘ఈ వంతెన మూడు అలలు కదులుతున్నట్లుగా ఉంటుంద’ని కొందరంటే... మరి కొందరు ‘ఆకాశానికి, భూమికీ మధ్యలో ఉన్న ఒక కన్నులా కనిపిస్తోంద’ని తమదైన శైలిలో రివ్యూలు ఇవ్వడంతో... సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.