Share News

Train Journey: ఏసీ కోచ్‌లో ఇలా ఎవరైనా చేస్తారా.. ఓ ప్రయాణికుడి ఆవేదన నెట్టింట వైరల్

ABN , Publish Date - Jun 09 , 2025 | 07:33 PM

ఏసీ కోచ్‌లో ప్రయాణించిన ఓ ధనిక కుటుంబం నానా రచ్చా చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

Train Journey: ఏసీ కోచ్‌లో ఇలా ఎవరైనా చేస్తారా.. ఓ ప్రయాణికుడి ఆవేదన నెట్టింట వైరల్
AC coach wedding party

ఇంటర్నెట్ డెస్క్: ఏసీ కోచ్‌లో ఓ ధనిక కుటుంబం చేసిన రచ్చపై ఓ ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయుల్లో మార్పు రావాలని అన్నారు. రెడిట్‌లో అతడు షేర్ చేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పటాల్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ధనిక కుటుంబంతో కలిసి ప్రయాణించిన తనకు దారుణ అనుభవం ఎదురైందని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. సుమారు 25 నుంచి 30 మంది పక్కపక్క బోగీల్లో ఎక్కారని తెలిపారు. వారంతా సింధీ వారిలా కనిపించారని, పెళ్లికి వెళుతున్నట్టు అనిపించిందని అన్నారు.

రైలు బయలుదేరాక కాసేపు కుదురుగా ఉన్న వారంతా ఆ తర్వాత రచ్చరచ్చ చేశారని చెప్పుకొచ్చారు. అరుపులు, ఆటలు, చివరకు స్పీకర్‌లో పాటలు పెట్టి నానా రభసా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు నగలు దిగేసుకుని ఇష్టారీతిన పొగరుగా వ్యవహరించారని తెలిపారు. సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్న ఇంగిత జ్ఞానం వారిలో కనిపించలేదని మండిపడ్డారు. అంతా చదువుకున్న వారిలాగే ఉన్నా కనీస సంస్కారం కానరాలేదని అన్నారు.


తాను మధ్య బెర్తులో ఉండగా వారంతా మిగతా బెర్తుల్లో ఉన్నారని, వారి గలాటా కారణంగా తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారొచ్చి ధనిక కుటుంబాన్ని మందలించినా కూడా మార్పు రాలేదని వాపోయారు. మాపైనే ఫిర్యాదు చేస్తావా.. ఇంకోసారి ఫిర్యాదు చేస్కో అంటూ తనను ఎద్దేవా చేసి మళ్లీ నానా హంగామా చేశారని అన్నారు.

‘ఇంతటి దారుణమైన ప్రయాణ అనుభవం నా జీవితంలో ఎదుర్కోలేదు. స్లీపర్ కోచ్‌ల్లోనే ఇంతకంటే ప్రశాంతంగా జర్నీ చేశా. కనీస పౌర స్పృహ కనిపించలేదు. విదేశాల్లో భారతీయులను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు సహించేవాడిని కాను. కానీ నాకే మనోళ్లను చూస్తే ఇప్పుడు చిరాకు పుడుతోంది’.


ఈ పోస్టుపై జనాల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఓ సమాజంగా భారతీయులకు సంస్కారం, క్రమశిక్షణ లేదని నెటిజన్లు పేర్కొన్నారు. మనోళ్లు ఒక దగ్గర చేరితే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

ఇవి కూడా చదవండి:

ఐఐటీ జేఈఈ పరీక్ష.. చాట్ జీపీటీ ఎన్ని మార్కులు స్కోరు చేసిందో తెలిస్తే..

అదృష్టవంతుడంటే ఇతడే.. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక రూ.15.6 కోట్ల లాటరీ

Read Latest and Viral News

Updated Date - Jun 09 , 2025 | 08:21 PM