Ahmedabad Flight Accident: పెళ్లై 6 నెలలు.. భర్త కోసం లండన్ వెళుతూ ఉండగా..
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:33 AM
Ahmedabad Flight Accident: గురువారం మొదటిసారి లండన్లోని భర్త దగ్గరకు బయలుదేరింది. ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఎంతో ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. కన్నవాళ్లను విడిచి వెళ్లడానికి ఎంతో బాధపడింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. ఓ వ్యక్తి తప్ప విమానంలోని అందరూ చనిపోయారు. చనిపోయిన వారికి సంబంధించిన చివరి వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్కు చెందిన కొత్త పెళ్లి కూతురు వీడియో ఒకటి వైరల్గా మారింది.
భర్త కోసం లండన్ వెళుతుండగా..
రాజస్థాన్ రాష్ట్రం బలోత్రా జిల్లా అరబ దుదాత్వ గ్రామానికి చెందిన ఖుష్భు కన్వర్ అనే యువతికి జనవరి నెలలో లండన్లో డాక్టర్గా పని చేస్తున్న విపుల్ సింగ్ రాజ్పురోహిత్తో పెళ్లయింది. పెళ్లైన నాటి నుంచి ఆమె ఇండియాలోని పుట్టింట్లోనే ఉంటోంది. గురువారం మొదటిసారి లండన్లోని భర్త దగ్గరకు బయలుదేరింది. ఇంటి నుంచి వెళుతున్నపుడు ఎంతో ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. కన్నవాళ్లను విడిచి వెళ్లడానికి ఎంతో బాధపడింది. అవే ఆమె కుటుంబసభ్యులతో గడిపిన చివరి క్షణాలు.
కొన్ని గంటల తర్వాత జరిగిన విమాన ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఇక, వైరల్గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటివి చూసినప్పుడే మనసుకు ఎంతో బాధగా ఉంటుంది. దేవుడికి అసలు మనసే లేదు. చిన్న పిల్లల్ని కూడా చంపేశాడు’.. ‘బోయింగ్ విమానాలు ఎప్పుడూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. వాటిని బ్యాన్ చేయాలి’..‘పాపం.. భర్త దగ్గరకు మొదటిసారి వెళుతూ ఉంది. అప్పుడే ప్రమాదం జరిగింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..