Share News

లైట్ తీసుకోవడం కష్టమే..

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:12 AM

అట్లాంటిక్‌ సముద్రం... ఎముకలు కొరికే అతి శీతలమైన జలాలు... కనుచూపు మేర కానరాని నేల. అలాంటి చోట ఠీవీగా నిల్చున్న 120 అడుగుల ఎత్తైన ఒక శిల. దానిపై అందమైన లైట్‌హౌస్‌. శిఖరాన్ని చేరుకోవడానికి ఏమాత్రం వీలులేని ఆ శిలపై లైట్‌హౌస్‌ను ఎవరు నిర్మించారు? ఇంతకీ ఆ నిర్మాణం ఎలా సాధ్యమైంది?

లైట్ తీసుకోవడం కష్టమే..

అట్లాంటిక్‌ సముద్రం... ఎముకలు కొరికే అతి శీతలమైన జలాలు... కనుచూపు మేర కానరాని నేల. అలాంటి చోట ఠీవీగా నిల్చున్న 120 అడుగుల ఎత్తైన ఒక శిల. దానిపై అందమైన లైట్‌హౌస్‌. శిఖరాన్ని చేరుకోవడానికి ఏమాత్రం వీలులేని ఆ శిలపై లైట్‌హౌస్‌ను ఎవరు నిర్మించారు? ఇంతకీ ఆ నిర్మాణం ఎలా సాధ్యమైంది?

ఐస్‌లాండ్‌ దగ్గరలో ఉన్న వెస్ట్‌మాన్‌ దీవుల్లో త్రిద్రానగర్‌ ఉంది. అక్కడే సముద్రంలో ఒక చోట కనిపిస్తుందీ అద్భుతమైన దృశ్యం. సదరు లైట్‌హౌస్‌ నిర్మాణం ఎలా చేశారో తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. నిటారుగా ఉన్న ఏకశిలపైకి కార్మికులు ఎలా చేరుకున్నారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. చుట్టూ గడ్డకట్టే స్థితిలో ఉండే అట్లాంటిక్‌ సముద్రపు నీరు... పొరపాటున నీళ్లలో పడితే నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందే. లైఫ్‌జాకెట్స్‌ ధరించినా అట్లాంటిక్‌లో టైటానిక్‌ మునిగిపోయినప్పుడు అందరూ చనిపోవడానికి కారణం... మంచుగడ్డలను తలపించే నీళ్లే. అలాంటి నీళ్ల మధ్యన ఎక్కడానికి ఏమాత్రం వీలు లేని శిలపై లైట్‌హౌస్‌ నిర్మాణం ఓ అద్భుతం. విపరీతమైన గాలి, తుపానులు, ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు వంటి ప్రతికూల పరిస్థితులు అక్కడ కనిపిస్తుంటాయి.


యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ...

అది రెండో ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయం. ఎక్కడ చూసినా వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆ సమయంలో అట్లాంటిక్‌ సముద్రంలో ప్రయాణించే యుద్ధ నావల కోసం లైట్‌హౌస్‌ నిర్మించాలని అనుకున్నారు. ఇంజనీర్‌ ఆర్నీ జి. థొరారిన్సన్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఆయన నిపుణులైన స్థానిక పర్వతారోహకులను నియమించుకున్నారు. వారి సహకారంతో డ్రిల్స్‌, సుత్తెలు, గొలుసులు, క్లాంప్స్‌ సహాయంతో పైకి చేరుకున్నారు. ‘‘చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఒకరి భుజాలపైన ఒకరు ఎక్కుతూ పైకి చేరు కున్నారు. గొలుసులు అమర్చి పైకి వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేశారు’’ అని ఇంజనీర్‌ థొరారిన్సన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో 1938 నుంచి 1939 మధ్యకాలంలో లైట్‌హౌస్‌ నిర్మాణం పూర్తి చేసుకుంది. దాన్ని ‘త్రిద్రానగర్‌ లైట్‌హౌస్‌’ అని పిలిచేవారు. ఇది ఐస్‌లాండ్‌ నైరుతి తీరం నుంచి 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

book3.2.jpg


ఇలా పాపులర్‌

ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత ఈ లైట్‌హౌస్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజానికి ఇలాంటి లైట్‌హౌస్‌ ఒకటుందని ప్రపంచానికి తెలియదు కూడా. అక్కడికి చేరుకోవడానికి దారి లేకపోవడం ప్రధాన కారణం. 1979 వరకు అదే పరిస్థితి. అయితే 1979లో ఆ శిలపై హెలికాప్టర్‌ రాకపోకలకు అనువుగా ఒక హెలిప్యాడ్‌ నిర్మించారు. అప్పటి నుంచి హెలికాప్టర్‌లో లైట్‌హౌస్‌ వద్దకు రాకపోకలు మొదలయ్యాయి.

ఐస్‌లాండ్‌కు చెందిన పైలట్‌ గిస్లీ గిస్లాసన్‌ మొట్టమొదటిసారి హెలికాప్టర్‌ను లైట్‌హౌస్‌ దగ్గర ల్యాండ్‌ చేశారు. ‘‘నేను వెస్ట్‌మన్నేజార్‌ అనే చిన్న ద్వీపంలో పెరిగాను. ఈ లైట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లాలన్నది నా చిన్నప్పటి కల. పైలట్‌గా నేను ఆ కలను సాకారం చేసు కున్నాను. అందులోనూ నేను మొదటివాడిని కావడం నా అదృష్టం’’ అంటారు పైలట్‌ గిస్లీ.


హెలికాప్టర్‌ అందుబాటులోకి వచ్చాక లైట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ‘‘హెలికాప్టర్‌ సేవలు మొదలయ్యాక వాణిజ్య ప్రకటనల చిత్రీకరణ కోసం చాలామంది వచ్చారు. పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. కొవిడ్‌ సమయంలో కొంతమంది పర్యాటకులు లైట్‌హౌస్‌లో బస చేస్తాం అని అడిగేవారు. కానీ రాత్రుళ్లు అక్కడ ఉండటానికి అనుమతి నిరాకరించాం’’ అని అంటారు గిస్లీ. ఈ లైట్‌హౌస్‌ పాపులర్‌ కావడానికి మోర్గన్‌బ్లాడిక్‌ అనే ఫొటోగ్రాఫర్‌ కారణం. ఆయన తీసిన ఫొటోలను 2009లో జస్టిన్‌ బీబర్‌ షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 2020లో ఐస్‌ల్యాండ్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ కలియో సభ్యులు ‘బ్రేక్‌ మై బేబీ’ పాట కోసం లైట్‌హౌస్‌ వీడియో చిత్రీకరణ చేశారు. ఈ లైట్‌హౌస్‌ సముద్రంలో 9 నాటికల్‌ మైళ్ల దూరం నుంచి కనిపించడం విశేషం.

Updated Date - Jun 15 , 2025 | 10:12 AM