Harsh Goenka: భారతీయులు మరింత పౌర స్పృహతో మెలగాలి.. పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:47 PM
భారతీయుల్లో పౌర స్పృహ పెరగాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకాపెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో భారతీయుల పరపతి పెరుగుతోందని ఆర్జీపీ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా తెలిపారు. కాబట్టి, విదేశాల్లో భారతీయులు మరింత పౌర స్పృహతో మసలుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
‘ఐరోపాలో నాకు మూడు కామెంట్స్ వినిపించాయి. ఒకప్పుడు తాము అరబ్స్ను మెచ్చుకునే వారమని ఇప్పుడు భారతీయులను ప్రశంసిస్తున్నామని ఓ షాపు యజమాని అన్నారు. టెక్ నుంచి వీసీ వరకూ ఎక్కడ చూసినా ఇండియన్స్ ఉన్నారని ఓ బిజినెస్మెన్ అన్నారు. నా వద్ద చదువుకుంటున్న అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులని ఓ ప్రొఫెసర్ కామెంట్ చేశారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, విదేశాల్లో భారతీయులు పౌర స్పృహతో మెలగట్లేదని విచారం వ్యక్తం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా మాట్లాడుతూ, క్యూ పద్ధతి పాటించకుండా, ఇష్టారీతిన చెత్త వేస్తూ వ్యవహరిస్తున్నారని అన్నారు. విదేశాల్లో మరింత పౌర స్పృహతో మసలుకోవాలని సూచించారు. భారతీయులందరూ మరింత పౌర స్పృహతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచాన్ని జయించాలంటే ముందుగా వారి హృదయాలను కొల్లగొట్టాలని సూచించారు. పౌర స్పృహ అలవర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
దీనిపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది హర్ష గోయెంకాతో ఏకీభవించారు. అయితే, భారతీయుల గురించి ఇన్ని ప్రశంసలు వినిపిస్తున్నాయంటే మనల్ని ప్రపంచం యథాతథంగా స్వీకరిస్తున్నట్టేనని, మార్పులు అవసరం లేదని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
వామ్మో.. ఎయిర్పోర్టులో చిన్న పిల్లలా కిందపడి డొల్లుతూ మహిళ గోల
లక్షలు ఆర్జిస్తున్న ఆటో డ్రైవర్ జీవితం తలకిందులు.. వీడియో వైరల్ కావడంతో షాక్