Share News

ఆనందానికీ ఉందొక పాఠం..

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:57 AM

ప్రపంచంలో ప్రతీ రంగానికీ ఒక ప్రత్యేక సబ్జెక్టు ఉంది. కానీ.. పరిపూర్ణంగా జీవించడం ఎలాగో చెప్పే పాఠమే లేదు. ‘ముందు చదువుకో.. ఆ తర్వాత జీవితమే అన్నీ నేర్పిస్తుంద’టారు. చదువు, ఉద్యోగం.. ఇలా కాలం గడిచిపోతుంది. నేర్చుకునేలోపు కళ్ల ముందే జీవితం కర్పూరంలా కరిగిపోతుంది.

ఆనందానికీ ఉందొక పాఠం..

ప్రపంచంలో ప్రతీ రంగానికీ ఒక ప్రత్యేక సబ్జెక్టు ఉంది. కానీ.. పరిపూర్ణంగా జీవించడం ఎలాగో చెప్పే పాఠమే లేదు. ‘ముందు చదువుకో.. ఆ తర్వాత జీవితమే అన్నీ నేర్పిస్తుంద’టారు. చదువు, ఉద్యోగం.. ఇలా కాలం గడిచిపోతుంది. నేర్చుకునేలోపు కళ్ల ముందే జీవితం కర్పూరంలా కరిగిపోతుంది. ఆఖరికి ఆస్తుల్ని కూడగట్టినా... ఆనందాన్ని సంపాదించలేదన్న ఆవేదన మిగులుతుంది. అందుకే.. ‘ఆనందంగా జీవించడం’ ఎలాగో ముందే నేర్చుకుంటే..? పాఠశాల తరగతి గదుల్లోనే అందరితో కలిసి ఆ హ్యాపీనెస్‌ పాఠాల్ని వింటే..? ఎంత అద్భుతమో కదా!. విద్యావేత్తలకు వచ్చిన ఆ కొత్త ఆలోచనే ‘హ్యాపీనెస్‌ క్లాస్‌’. ఈ ట్రెండ్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని పాఠశాలలు అనుసరిస్తున్నాయిప్పుడు...

ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాల... ఏడో తరగతి గది.. ఆ రోజు ఎందుకో కోలాహలంగా ఉంది. పిల్లల్లో ఒక్కటే ఉత్సాహం. క్లాస్‌లోకి వస్తూనే చిరునవ్వుతో పలకరించింది ఉపాధ్యాయిని. ఆమె ముఖంలో టీచరన్న దర్పం లేదు. పిల్లల్లో కూడా ఏ కోశానా బెరుకన్నదే లేదు. ఒక ఇంట్లో తల్లీపిల్లల్లాంటి వాతావరణమే ఉందక్కడ!. ఆమె చేతిలో బెత్తం కానీ, చాక్‌పీసులు కానీ లేవు. పిల్లలు కూడా తమ పుస్తకాలను ఎప్పుడో బ్యాగుల్లో సర్దేశారు. ఒక రకంగా చెప్పాలంటే.. గదినిండా పండగ వాతావరణం అలుముకుంది. ‘‘ఈ రోజు మనకు పాఠాలు లేవు. హోంవర్క్‌లు లేవు. హాయిగా కథలు చెప్పుకుందాం. ఆడుకుందాం. అల్లరి చేద్దాం.. ఆనందంగా గడిపేద్దాం.. సరేనా’’ అంటూ పిల్లల్లో చిన్నపిల్లలా మారిపోయిందా టీచరమ్మ!. ఆటగాళ్లు గోల్‌కొట్టాక అరిచే స్టేడియంలా దద్దరిల్లిపోయింది ఏడోతరగతి గది.

ఢిల్లీ పాఠశాలలో కనిపించిన ఆ అపురూప దృశ్య సందర్భం ‘హ్యాపీనెస్‌ క్లాస్‌’. పాఠశాలల్లో గణితం, ఇంగ్లీషు, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల్లాగే ఇప్పుడో కొత్త సబ్జెక్టు వచ్చి చేరింది. అదే ఈ హ్యాపీనెస్‌ క్లాస్‌. ఇన్నేళ్లకు ఆనందానికీ ఒక పాఠం వచ్చిందన్నమాట!.


ఢిల్లీలో శ్రీకారం..

మనిషికి చదువు ఎందుకు? ర్యాంకులు కొట్టడానికా? లేదంటే కేవలం ఉద్యోగాల కోసమా? ఒక్కమాటలో చెప్పాలంటే బతకడానికా - జీవించడానికా? ఈ క్లిష్టమైన ప్రశ్నకు ఎవరి సమాధానం వారికుంటుంది. ఎక్కువమంది దృష్టిలో చదువు అంటే.. కేవలం ఉపాధి! ఎంత డబ్బుపెడితే అంత పెద్ద కాలేజీలో చేరొచ్చు.. క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందవచ్చు.. అన్నదే ఆలోచన. నేడున్న వాణిజ్య పోటీ ప్రపంచంలో.. విద్య మూల సూత్రం మెల్లగా కనుమరుగవుతోంది. ఆ రంగం పూర్తిగా వ్యాపారమయం అయ్యిందిప్పుడు. సర్కారీ స్కూళ్లు మాత్రమే ఇంకా మిగిలున్నాయి. ఆ బడుల్లోని గోడలపైన తగిలించిన ఫొటోల్లోని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యకున్న పరమార్థాన్ని స్పష్టంగా చెప్పారు. జ్ఞానం (నాలెడ్జ్‌), ధర్మం (మొరాలిటీ), ఆధ్యాత్మిక వికాసం (స్పిరిచ్యువల్‌ డెవలప్‌మెంట్‌), సంస్కృతి (కల్చర్‌), ప్రజాస్వామ్యం (డెమొక్రసీ), దేశసేవ (సర్వీస్‌ టు సొసైటీ)...

book4.2.jpg


ఈ విలువలన్నీ నేర్పించి.. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే విద్య ప్రథమ లక్ష్యం. ‘ఉత్తమ మానవ నిర్మాణం’ పరమావధి కావాలన్నది సర్వేపల్లి ఆకాంక్ష. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఫీజులు, మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు.. ఇదే గొప్ప రాజ్యమేలుతోంది. చదువంటే పరిపూర్ణ వికాసంతో తీర్చిదిద్దిన మనిషి కాదు.. డబ్బులు సంపాదించే యంత్రం. నైతిక విలువలు, వ్యక్తిత్వవికాసానికి తోడ్పడలేని చదువుల వల్ల.. మానసిక ఆందోళన పెరిగిపోతోంది. పట్టభద్రులు అత్యధిక జీతాలు సాధిస్తున్నప్పటికీ.. తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది అంటున్నారు మానసిక నిపుణులు. విద్య మూల సూత్రాన్ని తిరిగి బతికించి.. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నారు అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. ఉన్నత చదువులు చదువుకున్న ఆయన మదిలో పుట్టిన అద్భుత ఆలోచనే ‘హ్యాపీనెస్‌ క్లాసులు’.


book4.3.jpg

అప్పటి విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా చొరవతో దేశ రాజధానిలోని పాఠశాలల్లో ఆనంద పాఠాలను బోధించడం మొదలుపెట్టారు. పిల్లలను నిత్యం పరీక్షలు, మార్కులు, ర్యాంకులంటూ తరుముతూ.. ఆందోళనకు గురిచేస్తే.. భవిష్యత్తులో అనేక మానసిక జబ్బుల బారినపడే అవకాశం ఉందన్నది వారి అభిప్రాయం. పని ప్రదేశం, కుటుంబం, సమాజం ఈ మూడింటితో సమన్వయం చేసుకోలేక.. సతమతం కావాల్సి వస్తుంది. అందుకే చిన్నప్పటి నుండే హాయిగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ చదువుకుంటే.. పరిపూర్ణ మానసిక వికాసంతో.. దృఢమైన వ్యక్తిత్వం కలిగిన నాయకులుగా ఎదుగుతారంటున్నారు విద్యావేత్తలు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన హ్యాపీనెస్‌ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన దలైలామా కూడా ఇదే భావాలను వ్యక్తపరిచారు. విద్యారంగంలో మొదలైన ఈ ఆనందకర మార్పు మెల్లగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందిప్పుడు!.


ప్రముఖులు సైతం..

హ్యాపీనెస్‌ క్లాసులను ఢిల్లీలో దలైలామా ప్రారంభించాక.. అనేక రాష్ట్రాలు సైతం ఈ ప్రయోగానికి సిద్ధమయ్యాయి. ఢిల్లీలో పద్నాలుగేళ్ల వయసు లోపున్న విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక తరగతులను బోధిస్తున్నారు. వివిధ సబ్జెక్టులకు నిర్ణీత సమయం కేటాయించినట్లే.. ఆనంద తరగతుల బోధనకు ముప్పావు గంట ప్రత్యేక పీరియడ్‌ ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో అంశంపైన బోధిస్తారు. పిల్లల మానసిక ఎదుగుదలకు, సంతోషకర జీవితానికి మార్గం ఏర్పడేలా అవగాహన కల్పిస్తారు ఉపాధ్యాయులు. ఆసక్తికర, నీతి కథలు చెప్పడం, యోగా నేర్పించడం, మెదడుకు మేత పెట్టే ఆటలు ఆడించడం, శారీరక దృఢత్వం పెంచే వ్యాయామాన్ని చేయించడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే శిక్షణ ఇవ్వడం.. వంటివన్నీ హ్యాపీనెస్‌ తరగతుల్లో భాగం. సాధారణ సబ్జెక్టులకు పరీక్షలు ఉంటాయి కానీ వీటికి ఎలాంటి శల్యపరీక్షలు ఉండవు. విద్యార్థుల ప్రతిభకు పోటీకానీ, మార్కులు కానీ అసలే ఉండవు. ‘‘విద్య అనేది నైతిక, సామాజిక ప్రయోజనానికి సంబంధించినది.


book4.5.jpg

సమాజ అవసరాలను కాదని వ్యక్తిగత ప్రయోజనం ఆశించి చూడకూడదు. ఆర్థిక సమానత్వ లక్ష్యాలను మనం పెట్టుకున్నా సరే.. సంతోష సమానత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలి.. అందుకోసమే మా హ్యాపీనెస్‌క్లాసులు కృషి చేస్తున్నాయి..’’ అన్నారు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు. దేశ రాజధానిలో తొలుత వెయ్యి పాఠశాలల్లోని ఇరవై వేల మంది ఉపాధ్యాయులకు హ్యాపీనెస్‌ క్లాసులపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఇలా తర్ఫీదు పొందిన టీచర్లు సుమారు పది లక్షల మంది విద్యార్థులకు కొత్త తరగతులను బోధించారు. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్‌ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు.. ఢిల్లీలో హ్యాపీనెస్‌క్లాసులు నిర్వహించే పాఠశాలను సందర్శించారు. అక్కడ యోగా చేస్తున్న విద్యార్థులను అభినందించారామె.


పాఠ్యాంశాలు వచ్చేశాయ్‌..

చదువుల్లో.. ఉద్యోగాల్లో.. జీవితంలో.. పోటీ.. పోటీ.. పరుగును ఆపడమే కష్టం. ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం నుంచే పిల్లల్లో మానసిక ఒత్తిళ్లకు బీజం పడుతోంది. ఈ మార్పు సమాజశ్రేయస్సుకు మంచిది కాదు. మానసిక, శారీరక ఆరోగ్యంతో పౌరులు ఎదగకపోతే సామాజిక శాంతి తగ్గిపోతుందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లుహెచ్‌వొ). నేటి పిల్లల్లో మానసిక ఆందోళన తీవ్రంగా పెరుగుతోందని.. ఈ రుగ్మతను తగ్గించాలంటే తిరిగి ఆనందాన్ని పెంచాలన్నది ఆ సంస్థ అభిప్రాయం. 13-15 ఏళ్ల మధ్యనున్న ప్రతి ముగ్గురు భారతీయ విద్యార్థుల్లో ఒకరు మానసిక ఒత్తిడితో జీవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి ఒత్తిడి మధ్య పెరిగే విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలవ్వగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డబ్ల్యుహెచ్‌వొ ప్రివెంటింగ్‌ సుసైడ్‌ రిపోర్ట్‌ పేర్కొంటోంది. అందుకే పాఠశాలల్లో హ్యాపీనెస్‌ క్లాసులను ఆ సంస్థ ప్రోత్సహిస్తోంది. ఢిల్లీ సర్కారు స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌ కూడా ఈ తరహా తరగతుల్ని పాఠశాలల్లో నిర్వహించడం మొదలుపెట్టింది. 9 నుంచి 12 వ తరగతుల విద్యార్థులకు రాష్ట్ర రాజ్య ఆనంద్‌ సంస్థాన్‌ (హ్యాపీనెస్‌ డిపార్ట్‌మెంట్‌) కృషి చేస్తోంది. తొలుత 450 బడుల్లో కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఇప్పుడు 9 వేల బడులకు విస్తరిస్తోంది.

book4.7.jpg


రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేకంగా ‘హ్యాపీనెస్‌ కరికులమ్‌’ను రూపొందించడం విశేషం. ‘‘విలువలతో కూడిన జీవితాన్ని సంతోషదాయకంగా.. సంతృప్తికరంగా సాగించే మార్గాన్ని బోధిస్తున్నాం’’ అంటున్నారు మధ్యప్రదేశ్‌ ఉపాధ్యాయులు. పిల్లలకు నేర్పే క్రమంలో తమ వ్యక్తిత్వంలో కూడా మార్పు వచ్చిందన్నారు. హ్యాపీనెస్‌ క్లాసుల్లో ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, సెల్ఫ్‌ అవేర్‌నెస్‌, గ్రూప్‌ యాక్టివిటీస్‌లతో పాటు ప్రవర్తనా నియమావళిని సైతం బోధిస్తున్నారు. ఈ పాఠాలు చెప్పడానికి మూడువేల మంది ఉపాధ్యాయులు శిక్షణ తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ‘‘బడుల్లో హ్యాపీనెస్‌ క్లాసులు ప్రారంభమయ్యాక మా పిల్లల్లో చాలా మార్పులు వచ్చాయి. టీవీలు, సెల్‌ఫోన్లు చూడటం తగ్గించేశారు. బద్దకం పోయింది. చిన్న చిన్న ఇంటి పనులు కూడా చేస్తున్నారు. సౌమ్యంగా మాట్లాడుతున్నారు. తోటి పిల్లలతో గొడవలు బాగా తగ్గిపోయాయి. మానసిక పరివర్తన స్పష్టంగా కనిపిస్తోంది...’’ అన్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్‌. ఈ ప్రయోగంతో తరగతి గదులన్నీ సంతోషంతో నిండిపోవడంతో.. అనేక రాష్ట్రాలు ఈ బోధనా పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నాయిప్పుడు. త్వరలోనే హ్యాపీనెస్‌ క్లాసులు దేశమంతా విస్తరించే అవకాశం ఉంది.


ఆనందం.. అంతర్జాతీయం..

ప్రపంచంలో ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దాలంటే పాఠశాలలకే సాధ్యం. ఎందుకంటే అక్కడి నుంచే బాల్యం మొదలవుతుంది కనక!. బడుల్లో చదువుతోపాటు సత్ప్రవర్తన, క్రమశిక్షణలను నేర్చుకుని.. జీవితంలోకి అడుగుపెట్టిన వాళ్లు.. ఉత్తమ పౌరులుగా బాధ్యతాయుతంగా మెలుగుతారని చెబుతోంది ఇంగ్లండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్‌ ఫర్‌ హ్యాపీనెస్‌’. సంతోషకర ప్రపంచం కోసం కలలు కంటున్న ఈ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. జీవితంలో హ్యాపీగా ఉండటం కోసం ప్రముఖుల ప్రసంగాలు, విశ్లేషణలు, కథనాలను అందిస్తోంది. ఇలాంటి సంస్థల ప్రచారం వల్ల ‘హ్యాపీనెస్‌’ అంతర్జాతీయ అంశంగా మారింది. జీవనశైలి సంక్లిష్టంగా మారడంతో.. ఆనందం అత్యవసర ఔషధమైందని గ్రహించాయి అనేక దేశాలు. అందుకే హ్యాపీనెస్‌ క్లాసుల్ని తమ విద్యా విధానంలో భాగం చేసుకున్నాయి.


ఈ క్రమంలో.. బోధనా, అభ్యాసన పద్ధతుల్ని మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. పోర్చుగల్‌, వియత్నాం, యెమన్‌, జపాన్‌, ఆప్ఘనిస్తాన్‌, భూటాన్‌, నేపాల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, పెరూ, మెక్సికోలలో కూడా ఈ తరహా తరగతులను ఆయా విద్యాశాఖలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయులకు మెరుగైన ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ అందించడం, పాఠశాలల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించడం, పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, విద్యార్థులు సంతోషంగా చదువుకోవడానికి ఆసక్తి చూపించేందుకు కృషి చేస్తున్నాయి హ్యాపీనెస్‌ క్లాసులను నిర్వహిస్తున్న పాఠశాలలు. ‘‘ఆయా దేశాల ఆర్థిక, సామాజిక వ్యవస్థలు బాగుండాలంటే... ఆ ప్రాంత పౌరులకు చదువు తప్పనిసరి. జీవన నైపుణ్యాలు కూడా అవసరం.


అప్పుడే ఆ దేశం ఇటు ఆర్థికంగా, అటు జీవన పరంగా ప్రశాంతంగా ఉంటుంది. హాపీనెస్‌ ఇండెక్స్‌లో కూడా గౌరవ స్థానం దక్కుతుంది...’’ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకు ఒకే ఒక్క పరిష్కారం.. పాఠశాల స్థాయిలోనే ఉత్తమ విద్యార్థులను తయారుచేయడం. ఇదే అందరికీ సులభం. విద్యార్థుల సంఖ్య ఎంత పెద్దదంటే.. ప్రపంచవ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో కలిపి సుమారు 90 నుంచి 100 కోట్ల మంది చదువుతున్నారు. ఒక్క భారత్‌లోనే 26 కోట్ల మంది విద్యాలయాల్లో అభ్యసిస్తున్నారు. హ్యాపీనెస్‌ క్లాసుల ద్వారా వీళ్లను మారిస్తే చాలు... అప్రయత్నంగానే ప్రపంచం మారుతుంది. హింస, అసహనం, ఆందోళనలు, ఆర్థిక, సామాజిక సంక్షోభాలు తగ్గుతాయి. ప్రశాంత జీవనం మెరుగవుతుంది అన్నది విద్యావేత్తల ఆలోచన. అందుకే ఇప్పుడు చిన్నగా మొదలైన ఆనంద అభ్యాసం... ఆకాశమంత విస్తరిస్తుందని ఆశిద్దాం.

- సండే డెస్క్‌

Updated Date - Jun 15 , 2025 | 10:57 AM