NRI: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 213వ సాహిత్య సదస్సు విజయవంతం
ABN , First Publish Date - 2025-05-27T17:23:56+05:30 IST
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 213వ "నెలనెల తెలుగువెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సాహితీ సదస్సులో సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరి భార్గవి "హృద్యమైన పద్య ప్రయాణం" అనే అంశంపై చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 213వ "నెలనెల తెలుగువెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సాహితీ సదస్సులో సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరి భార్గవి "హృద్యమైన పద్య ప్రయాణం" అనే అంశంపై చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించిన త్యాగరాజ కీర్తన "గజాననమ్ తం గణేశ్వరం" ప్రార్థనా గీతంతో సదస్సు ప్రారంభమైంది. సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేయగా.. టాంటెక్స్ 200వ సదస్సు కోసం ప్రముఖ కవి, కీ.శే. వడ్డేపల్లి కృష్ణ రాసిన "నెల నెలా - తెలుగు వెన్నెలా" గీత వైశిష్ట్యాన్ని కొనియాడుతూ, ఆ సుమధుర గీతాన్ని మరోసారి వినిపించారు. అనంతరం దయాకర్ మాడా ముఖ్య అతిథి పేరి భార్గవిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు.
ప్రధాన వక్త పేరి భార్గవి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, పద్యరచనలో తాను అడుగుపెట్టినప్పటి నుండి జరిగిన సంఘటనల క్రమాన్ని చక్కగా వివరించారు. పద్యరచనలో తనకు ఓనమాలు దిద్దించిన డాక్టర్ కొల్లారపు ప్రకాశరావు శర్మ, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ, నేమాని శ్రీనివాసరావు, కంది శంకరయ్య గార్లకు తాను ఎంతో ఋణపడి ఉన్నానని తెలిపారు. తనకు అరవై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాతనే యోగా నేర్చుకోవడం, అదే సంస్థలో శిక్షకురాలిగా అనేకమందికి యోగా నేర్పించడం, మానసిక వికలాంగులకు సేవ చేస్తూ తమ పనులను తాము చేసుకోనేటట్లు శిక్షణ నిచ్చి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించడం, ఇంద్రగంటి లక్ష్మణ శాస్త్రి వెంకట రావు వద్ద సంగీతము నేర్చుకోవడం, తిమ్మాబత్తుల చక్రవర్తి వద్ద వీధికోలాట ప్రక్రియను నేర్చుకొని తిరుమల మాడవీధులలో భక్తిపూర్వక కోలాటం ప్రదర్శనలో పాల్గొనడం - ఇవన్నీ భగవత్కృప వల్లనే సాధ్యమయ్యాయని ఆమె అన్నారు.
పేరి భార్గవి స్ఫూర్తిని మెచ్చుకుంటూ డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, దయాకర్ మాడ, డాక్టర్ వి.ఎన్. రాజ్యలక్ష్మి, కాశీనాధుని రాధ, విజయలక్ష్మి కందిబండ్ల, ఎన్.బి.టి. సుందరి, శ్రీ చంద్ర, డాక్టర్ నక్త రాజు, నిడిగంటి గోవర్ధన రావు తమ ప్రతిస్పందనలను తెలియజేశారు. సన్మానం తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ సమన్వయకర్త దయాకర్ మాడ, ముఖ్య అతిథి పేరి భార్గవి గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించారు. ఇంతమంది సాహితీ ప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు.
డాక్టర్ వి.ఎన్. రాజ్యలక్ష్మి మహాకవి కాళిదాసు వ్రాసిన "అభిజ్ఞాన శాకుంతలం" నాటకం నుండి శకుంతల, దుష్యంతల కథను ప్రస్తావించారు. మాతృత్వము, స్త్రీశక్తిని గురించి చెప్పే గొప్ప శ్లోకాలను శ్రీ లలితా సహస్రనామ శ్లోకాల నుండి ఎంచుకొని డాక్టర్ నక్త రాజు భావయుక్తంగా వివరించారు. అదేవిధంగా మాతృదినోత్సవ సందర్భంగా స్వీయ కవితను వినిపించారు. డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి తన ప్రసంగంలో మాతృప్రేమపై ప్రముఖ కవి సి.నా.రే. రాసిన "అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు" అనే పాటను పాడి వినిపించారు.
ఈ సదస్సులో సంస్థ తక్షణ పూర్వాధ్యక్షులు సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి, చిన్న సత్యం వీర్నాపు, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, ప్రపంచ తెలుగు సమాఖ్య చెన్నై కార్యవర్గ సభ్యులు శ్రీ యాలమూరి రంగారావు, శ్రీ లెనిన్ బంద, శ్రీ వీర లెనిన్ తుళ్లూరి, శ్రీ సత్యం ఉపద్రష్ట, శ్రీమతి బాలా త్రిపుర సుందరి, లక్ష్మి యద్దనపూడి, శ్రీమతి విజయలక్ష్మి కందిబండ, విజయ్ మామునూరి, శ్రీ లెనిన్ వేముల, శ్రీమతి కిరణ్మయి వేముల, శ్రీమతి శారదా సింగి రెడ్డి, శ్రీనివాస కుమార్ రాజా, గౌతమి పాణ్యం, డాక్టర్ నక్త రాజు, శ్రీమతి & శ్రీ రామ్ సీత మూర్తి, కాశీనాధుని రాధ, డాక్టర్ వి.ఎన్. రాజ్యలక్ష్మి, శ్రీమతి విజయ మామునూరి, నవీన్ గొడవర్తి, గోవర్ధనరావు నిడిగంటి వంటి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు. దయాకర్ మాద వందన సమర్పణతో సదస్సు ముగిసింది.
ఇవి కూడా చదవండి:
భారతీయుల ఈమెయిల్స్కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు.. భారతీయ విద్యార్థులకు అమెరికా మరో వార్నింగ్