Share News

Women Farmers Empowerment: ఆమె లక్ష్యం... రైతు హితం

ABN , Publish Date - May 31 , 2025 | 02:25 AM

మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు "గ్రామ్‌హిత్‌" సేవలను ప్రారంభించి, పంటలకు సరైన ధర కల్పించారు. ఈ సేవ ద్వారా 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయం పెరిగింది.

Women Farmers Empowerment: ఆమె లక్ష్యం... రైతు హితం

స్ఫూర్తి

నారు పోసి... ఆరుగాలం శ్రమించి... పంట పండించిన రైతుకు చివరకు నష్టమే మిగులుతోంది. అనాదిగా పాతుకుపోయిన దళారీ వ్యవస్థ నిలువుదోపిడీతో అప్పుల కుప్ప పేరుకుపోతోంది. దీనికి అడ్డుకట్ట వేసి... ‘గ్రామ్‌హిత్‌’ను తీసుకువచ్చి...రైతులను లాభాల బాట పట్టించారు మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే. ముప్ఫై ఐదు వేలమందికి పైగా రైతుల ఆదాయం పెంచి... వారి జీవితాల్లో నవక్రాంతులు తీసుకువచ్చిన శ్వేత ప్రయాణం ఇది.

‘‘చిన్న, సన్నకారు రైతుల కష్టాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినదాన్నే. నా చిన్నప్పుడు ఏటా మా అమ్మానాన్న వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకువచ్చేవారు. సాగు చేసి తెచ్చిన అప్పు తీర్చగలమని అనుకునేవారు. కానీ అది ఎప్పుడూ జరగలేదు. ఎంత కష్టపడినా కుటుంబ పోషణే కష్టమయ్యేది. చివరకు వ్యవసాయాన్ని వదిలి మా తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనుల కోసం నగరానికి వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఏటా నా చదువు కోసం డబ్బులు సమకూర్చడం వారికి పెద్ద సవాలే అయింది. ఆ కష్టాలన్నీ చూశాను కనుకనే రైతుల కోసం ఏదైనా చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను.

మాలానే ఎన్నో కుటుంబాలు...

ఈ కథ నా ఒక్కదానిదే కాదు... మాలానే కొన్ని లక్షల వ్యవసాయ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. పంట దిగుబడి పెరుగుతన్నప్పటికీ రైతుల ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది. దేశంలో 60 శాతం రైతులు వ్యవసాయాన్ని వదిలేయాలని అనుకుంటున్నట్లు అప్పట్లో ఓ సర్వేలో తేలింది. ఈ క్రమంలో... ఎలకా్ట్రనిక్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి ‘కస్తకర్‌’ సంస్థను స్థాపించాను. మహారాష్ట్ర యావత్మల్‌ జిల్లాలోని రైతులకు మొబైల్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలు అందించే ఉద్దేశంతో దీన్ని తీసుకువచ్చాం. వారికి ఎప్పటికప్పుడు మార్కెట్‌ ధరలు తెలియజేసేవాళ్లం. దాన్ని అనుసరించి రైతులు తమ పంటలను దళారులకు అమ్ముకునే విషయంలో నిర్ణయాలు తీసుకునేవారు. అలా ‘కస్తకర్‌’ రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఈ సేవలు మా జిల్లాకే పరిమితం కాకుండా... ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని అనుకున్నాం. తద్వారా మరింతమంది అన్నదాతలకు మేలు కలుగుతుందని భావించాం.


దళారుల దోపిడీకి చెక్‌...

పంట కొనుగోలు విషయంలో దళారుల గుత్తాధిపత్యం ఏ స్థాయిలో ఉందనేదానిపై మాకు పూర్తి అవగాహన కలిగింది. దానికి అడ్డుకట్ట వేయాలంటే రైతుల సమస్యలపై కూడా దృష్టిపెట్టాలి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఈ క్రమంలో ఎంతోమంది రైతులను కలిశాం. పంట నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంవల్ల కూడా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని గుర్తించాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ‘గ్రామ్‌హిత్‌’ను ప్రారంభించాం.

నేరుగా కొనుగోలు...

‘గ్రామ్‌హిత్‌’ రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. దీని ద్వారా రైతులు పండించిన పంటను నిల్వ చేస్తాం. వారికి సరైన ధర వచ్చేవరకూ పంటను సురక్షితంగా ఉంచుతాం. దీనివల్ల రైతులు సరైన ధర వచ్చే వరకు వేచిచూసే అవకాశం ఉంటుంది. డబ్బు అవసరాల కోసం కూడా రైతులు వెంటనే తమ పంటలను అమ్ముకుంటున్నారు. అందుకే మేము వారి అవసరానికి కావల్సిన డబ్బు సమకూరే మార్గం చూపిస్తున్నాం. దళారి అనేవాడు లేకుండా నేరుగా రైతులను... కొనుగోలుదారులను కలుపుతాం. దీనివల్ల రైతులకు పంటకు తగిన ధర లభిస్తుంది. తద్వారా ఆదాయం పెరుగుతోంది. ఎన్నడూ లేనంత లాభాలను రైతన్న చూస్తున్నాడు. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది.’’

వేలమంది రైతులకు...

ఇప్పటివరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయాన్ని పెంచగలిగాం. వీరిలో అయిదువేల మంది మహిళా రైతులు ఉన్నారు. గ్రామ్‌హిత్‌ ద్వారా నేను చేస్తున్న సేవలకు గానూ ఎన్నో అవార్డులు, పలు ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌లు అందుకున్నాను.

Updated Date - May 31 , 2025 | 02:26 AM