Share News

Yusuf Pathan drops: మోకాలడ్డిన టీఎంసీ, డెలిగేషన్ నుంచి యూసుఫ్ పఠాన్‌ ఔట్

ABN , Publish Date - May 19 , 2025 | 12:57 PM

తృణమూల్ ప్రతినిధిపై కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు? ఒక పార్టీ ఏ ప్రతినిధిని పంపాలో నిర్ణయించడానికి వారు ప్రతిపక్షాలతో చర్చలు జరపాలని టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.

Yusuf Pathan drops: మోకాలడ్డిన టీఎంసీ, డెలిగేషన్ నుంచి యూసుఫ్ పఠాన్‌ ఔట్
Yusuf Pathan drops

ఇంటర్నెట్ డెస్క్: దాయాది పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో ప్రపంచానికి చెప్పడానికి, భారతదేశం మీద పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేంద్రం ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ సిందూర్ ఔట్రీచ్' కార్యక్రమానికి సహకరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం చెప్పింది. తమ పార్టీ ఎంపి అయిన యూసుఫ్ పఠాన్‌ను తమకు తెలియపర్చకుండా డెలిగేషన్‌లోకి ఎలా తీసుకుంటారని కేంద్రాన్ని నిందించింది. అంతేకాదు, తమ పార్టీ ఎంపీ అయిన యూసఫ్ పఠాన్ ఈ బృందం నుంచి తప్పుకుంటున్నారని తేల్చిచెప్పింది.

కాగా, మోదీ ప్రభుత్తం ఇటీవల ప్రకటించిన 'ఆపరేషన్ సిందూర్ ఔట్రీచ్' ప్రతినిధి బృందంలో యూసఫ్ పఠాన్‌ను చేర్చిన సంగతి తెలిసిందే. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ పార్టీలకు చెందిన ఈ ఎంపీల బృందం 30 దేశాలను సందర్శించి భారత వాణి వినిపించాలని తలపెట్టారు. అయితే, తమ పార్టీని సంప్రదించకుండానే బహరాంపూర్ ఎంపి అయిన యూసఫ్ పఠాన్ పేరును చేర్చారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

"తృణమూల్ ప్రతినిధిపై కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు? ఒక పార్టీ ఏ ప్రతినిధిని పంపాలో నిర్ణయించడానికి వారు ప్రతిపక్షాలతో చర్చలు జరపాలి. తృణమూల్ ఏ ప్రతినిధిని పంపాలో బిజెపి ఎలా నిర్ణయించగలదు" అని టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.

పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వివిధ దేశాలను సందర్శించే బహుళ-పార్టీ ప్రతినిధులలో పఠాన్ లేదా మరే ఇతర టిఎంసి ఎంపి భాగం కాదని కూడా తృణముల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

"దేశం అన్నింటికంటే గొప్పదని మేము విశ్వసిస్తున్నాం. మన గొప్ప దేశాన్ని రక్షించడానికి అవసరమైన ఏ చర్య తీసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని చెప్పాం. మన సాయుధ దళాలు మన దేశాన్ని గర్వించేలా చేశాయి. మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అయితే, విదేశాంగ విధానం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం మాత్రమే మన విదేశాంగ విధానాన్ని నిర్ణయించనివ్వండి. దానికి పూర్తి బాధ్యత వహించనివ్వండి" అని టిఎంసి వర్గాలు అన్నాయి.


ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ ప్రచార కార్యక్రమం

అంతర్జాతీయంగా పాకిస్థాన్.. భారతదేశం పట్ల చేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి, ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో-టాలరెన్స్ విధానాన్ని చాటిచెప్పటానికి ఒక్కొక్క ఎంపీ నేతృత్వంలోని ఏడు గ్రూపులతో కూడిన ఈ బహుళ-పార్టీ ప్రతినిధి బృందాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది.

"ఒక మిషన్, ఒక సందేశం, ఒక భారత్" అనే ఈ అంతర్జాతీయ స్లోగన్‌తో, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సందర్భంలో ఉగ్రవాదంపై భారతదేశం అనుసరించిన వైఖరిని తెలియజేయడంలో ఐక్యతను చాటిచెప్పడమే ఈ బృందం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ ప్రతినిధులు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా, UK, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, UAE, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్, USA, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా, ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా ఇంకా దక్షిణాఫ్రికా వంటి దేశాలను సందర్శించనున్నారు.

ఇలాఉండగా, ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులతో సంబంధం ఉన్న 100 మందికి పైగా ఉగ్రవాదులను కచ్చితమైన దాడులతో మట్టుబెట్టింది. ఈ క్రమంలో 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపైన, పాక్ సైనిక మౌలిక సదుపాయాలను భారత్ దెబ్బతీసింది.


ఇవి కూడా చదవండి

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2025 | 01:10 PM