BJP - Mamata Banerjee: బీఎల్ఓ మృతి.. పశ్చిమబెంగాల్ సీఎం ఆరోపణలపై బీజేపీ ఆగ్రహం
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:48 PM
బీఎల్ఓ ఆత్మహత్య నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం చేస్తున్న ప్రకటనలకు విశ్వసనీయత లేదని బీజేపీ మండిపడింది. స్వతంత్ర దర్యాప్తు తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తేల్చి చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ (BJP) శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూత్ లెవెల్ ఆఫీసర్ ఆత్మహత్య (BLO Death) ఉదంతంలో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. అసత్య ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. స్వతంత్ర దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకూ సీఎం ప్రకటనలకు ఎలాంటి విశ్వసనీయత ఉండదని స్పష్టం చేశారు. బెంగాల్ ఓటర్ల జాబితా ప్రక్షాణలకు ఉద్దేశించిన ఎస్ఐఆర్ను తృణమూల్ ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. బీఎల్ఓ మృతికి ఈసీ కారణమని బెంగాల్ సీఎం ఆరోపించిన నేపథ్యంలో ఐటీ సెల్ చీఫ్ ఈ మేరకు ఘాటుగా బదులిచ్చారు.
‘ఎస్ఐఆర్ జరగాలని బెంగాల్ ప్రజలు, మహిళలు, యువత, నిజాయతీ పరుడైన ప్రతి పౌరుడు కోరుకుంటున్నారు. చొరబాటుదార్లు, డూప్లికేట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగించి జాబితాను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు’ అని అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
బీఎల్ఓగా విధులు నిర్వర్తిస్తున్న రింకూ తరఫ్దార్ అనే పారా టీచర్ మంగళవారం మరణించడం కలకలానికి దారితీసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని సీఎం మమత ఆరోపించారు. సూసైడ్ నోట్ను కూడా పంచుకున్నారు. ఈ ఘటనకు ఈసీ కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మండిపడింది. శారదా, రోజ్ వ్యాలీ, ఇతర చిట్ ఫండ్స్ స్కామ్స్లో బాధితులు కన్నుమూసినప్పుడు ఈ విచారం ఏమైందని బీజేపీ ప్రశ్నించింది. స్వతంత్ర దర్యాప్తు తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంది. సీఎం మాటలకు విశ్వసనీయత లేదని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి...
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
పంజాబ్లో ఎన్కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి