ఆర్థిక మాంద్యంతోనే ‘కింగ్ఫిషర్’ కుదేలు!
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:29 AM
అప్పులు తిరిగి చెల్లిస్తానని చెప్పినా తనపై ‘దొంగ’ అనే ముద్ర వేశారని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా అన్నారు.

ఎయిర్లైన్స్ పరిధిని కుదిస్తానంటే ప్రణబ్ ముఖర్జీ వద్దన్నారు
బ్యాంకులు సహకరిస్తాయన్నారు
నా బకాయిలు రూ.6,203 కోట్లే.. 9 వేల కోట్లనడం అబద్ధం
నేనేమీ పారిపోలేదు..
జైట్లీకి చెప్పే జెనీవా వెళ్లాను: మాల్యా
న్యూఢిల్లీ, జూన్ 6: అప్పులు తిరిగి చెల్లిస్తానని చెప్పినా తనపై ‘దొంగ’ అనే ముద్ర వేశారని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా అన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగానే తన సంస్థ దెబ్బతిందని వాపోయారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఎయిర్లైన్స్ పరిధిని కుదించాలనుకుని నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించానని.. కానీ ఆయన తిరస్కరించారని తెలిపారు. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా శుక్రవారం యూట్యూబర్, పారిశ్రామికవేత్త రాజ్ శామనీతో ‘పాడ్కా్స్ట’లో సంభాషించారు. కింగ్ఫిషర్ పతనానికి దారితీసిన పరిణామాలను వివరించారు. ‘2005లో ప్రారంభించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనతికాలంలోనే నాణ్యమైన సేవలతో మంచిపేరు తెచ్చుకుంది. 2008 వరకు మా కార్యకలాపాలు సజావుగా నడిచాయి. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో సమస్యలు చుట్టుముట్టాయి. ధనప్రవాహం నిలిచిపోయింది. రూపాయి విలువ క్షీణించింది. ఆర్థిక వాతావరణం నానాటికీ పతనావస్థకు చేరడంతో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు కుదించడానికి అనుమతివ్వాలని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి అభ్యర్థించాను. విమానాల సంఖ్య తగ్గిస్తానని, ఉద్యోగులను తొలగిస్తానని.. కంపెనీ పరిధిని కుదిస్తానని కోరాను. ఆయన తిరస్కరించారు. కార్యకలాపాలు కొనసాగించాలని.. బ్యాంకులు సహకరిస్తాయని చెప్పారు. కింగ్ఫిషర్ సంక్షోభానికి అదే నాంది. ఆయన తప్పుడు సలహా ఇచ్చారు. సంస్థ పనితీరు సరిగా లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఆర్థిక సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. చివరకు విమానాలన్నీ నిలిపివేశాం’ అని తెలిపారు. ఆర్థిక అవకతవకలపై స్పందిస్తూ.. బ్యాంకులు డబ్బులు తిరిగి చెల్లించాలన్న సదుద్దేశంతో నాలుగు సెటిల్మెంట్ ప్రతిపాదనలు వాటి ముందు పెట్టానని.. కానీ అవి తిరస్కరించాయని ఆరోపించారు. బ్యాంకుల్లో పారదర్శకత లేదని విమర్శించారు. 15 సార్లు జ్ఞాపకం చేసినా.. తన అకౌంట్ స్టేట్మెంట్ను ఇవ్వలేదన్నారు. తాను చెల్లించాల్సిన మొత్తం రుణాలు 14,131.6 కోట్లకు చేరాయని పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రకటన చేశారని తెలిపారు. తాను 9 వేల కోట్లు బకాయి పడినట్లు మీడియాలో వచ్చిన కథనాలతో ఆయన విభేదించారు. తాను తీసుకున్న అప్పు రూ.6,203 కోట్లు మాత్రమేనన్నారు. అప్పుపడిన దానికంటే ఎక్కువే చెల్లించినా తనపై దొంగ అన్న ముద్ర వేశారన్నారు.
జెనీవా వెళ్తున్నానని జైట్లీకి చెప్పా..
టీవీ యాంకర్లు తాను పరారయ్యారని అన్నారని.. కానీ తానేమీ పారిపోలేదని మాల్యా చెప్పారు. 2016 మార్చిలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమాచారమిచ్చే జెనీవా వెళ్లానని.. రుణాల సెటిల్మెంట్కు బ్యాంకులు సంప్రదింపులు జరిపేలా చేయాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. ‘‘జైట్లీని నేను కలిసిన విషయం మీడియాలో రావడంతో ఆయన తొలుత ఖండించారు. అయితే ఓ కాంగ్రెస్ ఎంపీ మా ఇద్దరినీ చూసి మీడియాతో మాట్లాడడంతో జైట్లీ మాటమార్చారు. క్లుప్తంగా మాత్రమే మాట్లాడుకున్నామని.. సమావేశం కాలేదని చెప్పారు. అయితే నేను నేరస్థుడిని కాను. విదేశీ భాగస్వాములను సమన్వయం చేసుకుని రుణాలు చెల్లించాలని భావించాను. ఈడీని సమయం కోరాను. అయితే విదేశాల్లో ఉండగా నా పాస్పోర్టు రద్దుచేయడంతో భారత్కు తిరిగి రాలేకపోయా’ అని చెప్పారు. కింగ్ఫిషర్ పతనానికి తొలిసారి మాల్యా బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
మోదీ ‘నేరపూరిత’ఎకనామిక్స్’: కాంగ్రెస్
అరుణ్ జైట్లీకి చెప్పే విదేశాలకు పారిపోయానని మాల్యా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని మోదీ ప్రవచిత ‘పకోడా ఎకనామిక్స్’.. నేరపూరిత ఎకనామిక్స్’గా మారాయని ఏఐసీసీ మీడియా ఇన్చార్జి పవన్ ఖేరా ధ్వజమెత్తారు. మాల్యా పరారీలో మోదీ ప్రభుత్వ హస్తం ఉందనేది స్పష్టమైందన్నారు. ‘మీపై దాడి చేయబోతున్నామని విదేశాంగ మంత్రి పాకిస్థాన్కు ముందే చెప్పేస్తారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన నేరగాళ్లు దేశ ఆర్థిక మంత్రికి చెప్పే పరారవుతారు. నరేంద్ర మోదీ వ్యవస్థంతా లొంగుబాటే’ అని ఎద్దేవాచేశారు.