Union Minister Giriraj: బిహార్లో గెలుపు మాదే.. ఇక బెంగాల్లోనూ..: కేంద్ర మంత్రి
ABN , Publish Date - Nov 14 , 2025 | 02:05 PM
బిహార్ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పును ఇవ్వబోతున్నారని.. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బెంగాల్లోనూ అధికారం చేపట్టబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్(Bihar Election Results)లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ.. మ్యాజిక్ ఫిగర్ను దాటేసి 199 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆ కూటమిలోని బీజేపీ, జేడీయూ పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్లో ఇప్పటికే తమ గెలుపు ఖాయమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తర్వాత బెంగాల్ వంతు అని, త్వరలో అక్కడా అధికారం చేపడతామన్నారు.
'బిహార్ను అర్థం చేసుకున్న వారికి ఇక్కడి ప్రజలు ఆటవిక రాజ్యాన్ని కోరుకోవడం లేదని తెలుసు. ఇక్కడి ప్రజలు అవినీతిని, అరాచక నాయకత్వాన్ని తిరస్కరిస్తారు. అంకితభావంతో కూడిన బీజేపీ నేతగా చెబుతున్నా.. బిహార్లో ఎన్డీయే విజయం తథ్యం. ఇక బెంగాల్ వంతు. అక్కడ జరిగే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం.' అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో 2026 మార్చి-ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.
మళ్లీ ఆయనే సీఎం.!
బిహార్ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. అక్కడి ప్రజలు అన్యాయాన్ని వద్దనుకుంటున్నారని గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఎన్డీయే అభివృద్ధికి పట్టం కట్టాలనే ఓటర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోందన్నారు. కాబట్టి ఇక ఆ రాష్ట్రం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లదని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తుండటంతో సీఎం అభ్యర్థిపైనా ఎలాంటి గందరగోళం ఉండదన్న మంత్రి.. నీతీశ్ కుమార్ నేతృత్వంలోనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకానుందని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..