Union Budget: బడ్జెట్లో ఆ రాష్ట్రాలకు నిధుల వరద.. అసలు సంగతి ఏమిటంటే
ABN , Publish Date - Feb 01 , 2025 | 09:47 AM
కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రాలకు ఈ ఏడాది కేటాయింపులు అధికంగా ఉండనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వం వరాల జల్లు కురిపించనుందా..

బడ్జెట్ అంటేనే లెక్కలతో తికమక.. ఓ రకంగా చెప్పాలంటే బడ్జెట్ పేపర్లు చూస్తే అందులో లేక్కలు సామాన్యుడికి అర్థం కావు.. కానీ బడ్జెట్లో ఏముందనే విషయాన్ని తెలుసుకుంటారు. ముఖ్యంగా బడ్జెట్ పెట్టారనగానే.. ఈ ఏడాది ఏ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించారు. ఏ రాష్ట్రానికి మొండిచెయి చూపించారనే చర్చ సాధారణంగా జరుగుతోంది. ఇటీవల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు బడ్జెట్ను స్వాగతిస్తాయి. ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో ఇవాల్టి బడ్జెట్లో ఏ రాష్ట్రాలకు పెద్దపీట వేయబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. సాధారణంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న రానున్న ఏడాదికాలంలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేయడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెలలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు ఉండవవచ్చనే చర్చ జరుగుతోంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు సంతృప్తికరంగా ఉండొచ్చని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రాలకు నిధులు అధికంగా కేటాయించే అవకాశం ఉందో తెలుసుకుందాం
బీహార్..
బీహార్ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగనున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. సీఎంగా జేడీయూ నేత నితీష్ కుమార్ ఉన్నారు. వచ్చే ఎన్నికలు ఆయన ఎన్డీయేతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటానికి జేడీయూ, టీడీపీ ఎంపీల బలం చాలా అవసరం ఈ నేపథ్యంలో బీహార్కు బడ్జెట్లో ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేకపోతే ఆయన కూటమిలోంచి బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. శాసనసభ ఎన్నికల ముందు సానుభూతి కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆయన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతుంది. ఈక్రమంలో బీహార్కు తప్పనిసరిగా కేటాయింపులు అధికంగా ఉండే ఛాన్స్ ఉంది.
అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు..
అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రియల్- మే మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అస్సాం మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్నాయి. దీంతో ఇక్కడ పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు సంతృప్తికర స్థాయిలో కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఏ రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత ఉండబోతుందో మరికాసేపట్లో తేలనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here