Ujjwal Nikam On Sanjay Dutt: ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవాడు: ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:08 AM
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవాడని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహానగరం ముంబైలో 1993లో జరిగిన పేలుళ్ల (Mumbai Blasts) కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) తలుచుకుని ఉంటే ఆ పేలుళ్లను ఆపి ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదిగా పలు సంచలన కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
'1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ వచ్చింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూం సలేం తీసుకొచ్చిన ఆ వ్యాన్లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాటిని సంజయ్ పరిశీలించారు. వాటిల్లో నుంచి ఒక ఏకే 47 తుపాకీని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగి అంత మంది చనిపోయి ఉండేవారు కాదు' అని ఉజ్వల్ పేర్కొన్నారు.
ముంబై పేలుళ్లతో సంబంధం ఉందనే కారణంతో సంజయ్పై అప్పట్లో టాడా కేసు నమోదైంది. సంజయ్ ఉగ్రవాది అని ఆరోపణలు వచ్చాయి. కోర్టు మాత్రం సంజయ్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం మాత్రం రుజువు కావడంతో సంజయ్ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ 2016లో విడుదల అయ్యాడు. కాగా, న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీలో చేరి 2024లో ముంబై నార్త్-సెంట్రల్ లోక్సభ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది.
ఇవి కూడా చదవండి
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..