Anil Chauhan: భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి
ABN , Publish Date - May 31 , 2025 | 03:03 PM
ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ కొట్టివేశారు. యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని, ఎలాంటి పొరపాట్లు జరగాయన్నదే ముఖ్యమని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్పై భారత్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరసగా దాడులు చేస్తూ దాయాది దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఉగ్రశిబిరాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను మట్టుపెట్టింది. అయితే పాకిస్థాన్ సైతం భారత్పై దాడికి దిగింది. పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ యుద్ధంతో భారత్కు చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాక్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను సీడీఎస్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) కొట్టిపారేశారు. సింగపూర్లో శనివారం నాడు షాంగ్రి-లా-డైలాగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ దేశానికి సీడీఎస్ వెళ్లారు. ఈ సందర్భంగా బ్లూమింగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ అనిల్ చౌహాన్ కొట్టివేశారు. ఫైటర్ జెట్లు కోల్పోయిన మాట వాస్తవమేనని ఆయన పరోక్షంగా చెప్పారు. అయితే యుద్ధ విమానాలు నేలకూలిన అంశం ప్రధానం కాదని.. తప్పులు సరిదిద్దుకుని దాడులను తిప్పికొట్టామన్నదే ముఖ్యమన్నారు. అలాగే కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్యనూ సీడీఎస్ వెల్లడించలేదు. నాలుగు రోజుల యుద్ధంలో ఏ రోజూ అణుయుద్ధం వరకూ వెళ్లే పరిస్థితి రాలేదని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు ఏమి జరిగాయో తెలుసుకుని వాటిని సరి చేసి రెండ్రోజుల తర్వాత తిరిగి అమలు చేశామన్నారు. అలాగే అన్ని విమానాలను సుదీర్ఘ లక్ష్యాల వైపు మళ్లించామని చెప్పారు.
భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో దేశీయ యుద్ధవిమానాల సామర్థ్యంపై అటు కేంద్రం, ఇటు మిలటరీ అధికారులు నేరుగా స్పందించలేదు. ఈ క్రమంలో సీడీఎస్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మొదట్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ప్రకటించారు. అయితే న్యూఢిల్లీ మాత్రం అవుననీ, కాదనీ చెప్పలేదు. కాగా, భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండనున్నాయనడానికి పాకిస్థాన్పై జరిపిన ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. మోడ్రన్ వార్ఫేర్ అనేది ఇప్పుడు టెక్నాలజీ, సైబర్ ఆపరేషన్స్, సమాచారాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటోందన్నారు.
ఆపరేషన్ ప్రారంభంలో మొదటి మూడు రోజులు ఇద్దరు ప్రధాన మహిళా అధికారులు ప్రధాన స్పోక్స్పర్సన్స్గా మీడియాకు సమాచారం ఇచ్చారన్నారు. ఆపరేషన్ వేగవంతంగా నిర్వహించేందుకు మిలటరీ నాయకత్వం బిజీగా ఉండటంతో ఆ ఇరువురు మీడియా మందుకు వచ్చారని తెలిపారు. 10వ తేదీ తర్వాత మాత్రమే మీడియాకు వివరాలు చెప్పేందుకు డీజీఎంఓలు వచ్చారని పేర్కొన్నారు. సైబర్ దాడులపై మాట్లాడుతూ.. రెండు వైపులా సైబర్ దాడులు జరిగాయని, అయితే ప్రధానమైన మిలటరీ సిస్టమ్లపై వాటి ప్రభావం చాలా తక్కువని చెప్పారు. మన మిలటరీ సిస్టమ్లు ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండవని, అందువల్ల చాలా వరకూ సురక్షితంగా ఉంటాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారారు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి