Sunitha Williams: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:50 PM
Sunitha Williams: దాదాపు ఎనిమిది నెలల అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణించిన వ్యోమ నౌక సురక్షితంగా భూమిని చేరింది. అనంతరం వారిని హ్యూస్టన్ తరలించారు. ఎందుకంటే..

దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణించిన వ్యోమ నౌక ఎట్టకేలకు భూమికి చేరుకొంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3.27గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ఇది దిగింది. అప్పటికే అక్కడకు చేరుకున్న సహాయ బృందాలు క్రూ డ్రాగన్ను వెలికితీశాయి. ల్యాండింగ్ అనంతరం వీరిద్దరిని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు.అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే వారికి ఈ వైద్య పరీక్షలు ఎందుకంటే.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగిపోతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు.
వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువకాలం అంతరిక్షంలో ఉంటే, వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కుంటారు. అలాగే వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు ఎదురు కావచ్చునని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు.
మరోవైపు అంతరిక్షంలోకి వెళ్లి.. 8 ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తారని అంతా అనుకున్నారు. కానీ వ్యోమ నౌకలో అంతరాయం ఏర్పడడంతో.. 8 నెలల అనంతరం వారు భూమిపై తిరిగి వచ్చారు. దీంతో అటు సునీతా విలియమ్స్, ఇటు విల్మోర్ కుటుంబ సభ్యులు వీరిని కలిసే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు.
2024, జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక "స్టార్లైనర్"లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది.అయితే, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారిద్దరు దాదాపు 9 నెలలుగా ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ను ఐఎస్ఎస్కు పంపించింది. అది ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతో సునీతా, విల్మోర్ల రాకకు మార్గం సుగమమైన సంగతి తెలిసిందే.
For National News And Telugu News