Son And Mother: అన్నదమ్ముల మధ్య గొడవ.. విడిపించడానికి వెళ్లిన తల్లిని..
ABN , Publish Date - May 31 , 2025 | 03:51 PM
Son And Mother: కటింగ్ షాపు నడపగా వచ్చిన డబ్బులు పంచుకోవటంలో ఇద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. కొద్దిరోజుల క్రితం మంజునాథ, లక్ష్మణల మధ్య డబ్బుల విషయంలో గొడవ మొదలైంది.

నేటి ప్రపంచంలో రక్త సంబంధాలకంటే డబ్బులకే ఎక్కువ విలువ ఉంటోంది. డబ్బుల విషయంలో ఎవ్వరినీ కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాణాలను తీయడానికి కూడా కొంతమంది వెనకాడటం లేదు. తాజాగా, ఓ ఇద్దరు అన్నదమ్ములు డబ్బుల కోసం గొడవపడ్డారు. గొడవను ఆపడానికి వచ్చిన తల్లిపై అన్నదమ్ముల్లో ఒకడు పదునైన అద్దం ముక్కతో దాడిచేశాడు. అద్దం ముక్క ఆ తల్లి కడుపులో దిగబడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళిలో చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హుబ్బళి తాలూకా, తోరవి హక్కల్ గ్రామానికి చెందిన 46 ఏళ్ల పద్మ చలూరికి ఇద్దరు కొడుకులు మంజునాథ్, లక్ష్మణ ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులు ఊరిలోనే శ్రీనివాస కటింగ్ షాపును నిర్వహిస్తున్నారు. కటింగ్ షాపు నడపగా వచ్చిన డబ్బులు పంచుకోవటంలో ఇద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. కొద్దిరోజుల క్రితం మంజునాథ, లక్ష్మణల మధ్య డబ్బుల విషయంలో గొడవ మొదలైంది.
ఈ విషయం తెలిసి పద్మ వారి దగ్గరకు వెళ్లింది. ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే, మంజునాథ్ విచక్షణ మర్చిపోయాడు. డబ్బుల విషయంలో తల్లి లక్ష్మణకే మద్దతునిస్తోందని ఆగ్రహానికి గురయ్యాడు. పక్కనే ఉన్న అద్దం ముక్కతో ఆమె పొట్టలో పొడిచేశాడు. అద్దం ముక్క లోతుగా కడుపులో దిగబడ్డంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. మంజునాథ్, లక్ష్మణ వెంటనే ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంజునాథ్, లక్ష్మణను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మేఘా వేమూరిపై కాలేజ్ ఎందుకు బ్యాన్ విధించిందంటే..
థైరాయిడ్ బరువు వదిలించుకోలేకపోతున్నారా? దిగులుపడకండి.. ఈ చిట్కాతో ప్రాబ్లం సాల్వ్..