Share News

Shashi Tharoor: థరూర్‌.. లక్ష్మణరేఖ దాటారు!

ABN , Publish Date - May 29 , 2025 | 06:05 AM

ఎంపీ శశిథరూర్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్‌ శశిథరూర్‌ పేరు ప్రతిపాదించకపోయినా..

Shashi Tharoor: థరూర్‌.. లక్ష్మణరేఖ దాటారు!

  • కేరళ ఎంపీపై కాంగ్రెస్‌లో ఆగ్రహం

న్యూఢిల్లీ, మే 28: ఎంపీ శశిథరూర్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్‌ శశిథరూర్‌ పేరు ప్రతిపాదించకపోయినా.. విదేశాలకు వెళ్లే ఓ ఎంపీల బృందానికి సారథిగా కేంద్రం ఎంపిక చేయటం, దానికి ఆయన అంగీకరించటంతో పార్టీకి, శశిథరూర్‌కు మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. కాగా, తాజాగా పనామాలో శశిథరూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉగ్రదాడులను భారత్‌ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన యురి, పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు.


దీనిపై కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్‌ మీద పలుమార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్వయంగా చెప్పిన వీడియోను శశిథరూర్‌కు ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ ప్రచారానికి వాడుకోలేదని కాంగ్రెస్‌ గతంలోనూ పేర్కొంది. కానీ, పార్టీ వైఖరికి భిన్నంగా శశిథరూర్‌ మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.

Updated Date - May 30 , 2025 | 02:58 PM