Shashi Tharoor: దేశం విషయంలో రాజకీయ వైరాలు అడ్డుకారాదు: శశిథరూర్
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:34 PM
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఇటీవల కాలంలో సంబంధాలపై కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, రాజకీయాలు అంటేనే పోటీ అని, తనలాంటి వాళ్లు తమ పార్టీలను గౌరవిస్తారని, అయితే జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి మనం ఇతర పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుందని అన్నారు.

న్యూఢిల్లీ: పార్టీ ప్రయోజనాల కన్నా దేశం ముఖ్యమనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, కొన్ని సార్లు దీన్ని నమ్మకద్రోహంగా భావిస్తుంటారని, అదే పెద్ద సమస్య అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా రాజకీయాలు అంటే పోటీ కావడం దురదృష్టకరమని, కొన్ని సందర్భాల్లో క్రాస్-పార్టీ సహకారాన్ని అవిధేయతగా చూస్తుంటారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఇటీవల కాలంలో సంబంధాలపై కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, రాజకీయాలు అంటేనే పోటీ అని, తనలాంటి వాళ్లు తమ పార్టీలను గౌరవిస్తారని, అయితే జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి మనం ఇతర పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుందని, అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి పార్టీలు దానిని అవిధేయతగా భావిస్తుంటాయని, అదే పెద్ద సమస్య అని నవ్వుతూ సమాధానమిచ్చారు. మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైనదేనని తాను నమ్మడం వల్ల అనేక మంది తనను విమర్శించారని, అయితే తన వైఖరి సరైనదేనని తాను నమ్మి నిలబడ్డానని చెప్పారు.
జాతీయ భద్రతకు తాను ఎన్నడూ తొలి ప్రాధాన్యమిస్తానని, ఏ రాజకీయ పార్టీ అయినా దేశాన్ని మెరుగుపరచాలనే కోరుకుంటుందని అన్నారు. తనకు దేశమే మొదటి ప్రాధాన్యత అన్నారు. దేశాన్ని మెరుగుపరచడమే పార్టీల ఉద్దేశం కావాలన్నారు. సిద్ధాంతాల పరంగా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చనీ, అయితే సురక్షితమైన భారత్కు అవన్నీ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. 'దేశం చనిపోతో ఎవరు జీవిస్తారు' అని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ ఐక్యతకు రాజకీయాలు అడ్డుకారాదన్నారు. సమావేశానంతరం కాంగ్రెస్ అధిష్ఠానంతో ఏవైనా సమస్యలున్నాయా అని అడిగినప్పుడు, రాజకీయాలు గురించి, సమస్యల గురించి మాట్లేడేందుకు తాను ఇక్కడకు రాలేదంటూ ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి..
రోగాలు నయం చేస్తానంటూ బాబా దారుణం..
విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఆగ్రహం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి