Ahmedabad Flight Accident: 15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..
ABN , Publish Date - Jun 14 , 2025 | 07:32 AM
Ahmedabad Flight Accident: జావెద్ చనిపోయిన విషయం అతడి తల్లికి చెప్పలేదు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇది వరకే స్టంట్ వేశారు. మరికొన్ని రోజుల్లో మరో స్టంట్ వేయాల్సి ఉంది.

అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ 242 మందిలో జావెద్ కుటుంబం కూడా ఉంది. ప్రమాదంలో జావెద్, జావెద్ భార్య మరియం.. వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కూతురు చనిపోయారు. జావెద్ చదువుల నిమిత్తం ఇండియా నుంచి 11 ఏళ్ల క్రితం లండన్ వెళ్లిపోయాడు. అక్కడ మరియం అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం అతడికి బ్రిటీష్ పౌరసత్వం ఉంది.
బక్రీద్ సందర్భంగా జావెద్ తన కుటుంబంతో పాటు అహ్మదాబాద్ వచ్చాడు. జావెద్ తోబుట్టువులు 15 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా బక్రీద్ జరుపుకుంది. జావెద్ తల్లి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. కొన్ని రోజులు ఫ్యామిలీతో గడిపిన తర్వాత.. జూన్ 12వ తేదీన జావెద్ ఫ్యామిలీ లండన్ బయలు దేరింది. ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. జావెద్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది.
ఈ విషయం అతడి తల్లికి చెప్పలేదు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇది వరకే స్టంట్ వేశారు. మరికొన్ని రోజుల్లో మరో స్టంట్ వేయాల్సి ఉంది. అందుకే ఆమెకు చెప్పలేదు. జావెద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అతడు నా తమ్ముడు. మాతో సంతోషంగా గడపడానికి అహ్మదాబాద్ వచ్చాడు. ఈ ప్రమాదంలో మా కుటుంబసభ్యుల్ని కోల్పోయాము. దీనికి బాధ్యత ఎవరిది. 240 మందికి పైగా చనిపోయారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. అలా ఎలా జరుగుతుంది’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి
లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..
ఎలా బతికానో నాకే అర్థం కావట్లేదు!