Rajnath Singh: పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి.. రాజ్నాథ్ సింగ్ విజ్ణప్తి..
ABN , Publish Date - May 15 , 2025 | 02:05 PM
బాధ్యత లేని.. మూర్ఖమైన పాకిస్థాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.

జమ్మూకాశ్మీర్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటిసారి జమ్మూకాశ్మీర్కు వెళ్లారు. గురువారం అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఆర్మీకి సంబంధించిన 15 కాప్స్ హెడ్ క్వాటర్స్కు కూడా ఆయన వెళ్లారు. అక్కడ ఆర్మీ జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంపై కేంద్రమంత్రి మాట్లాడారు. బాధ్యత లేని.. మూర్ఖమైన పాకిస్థాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని ఆయన అన్నారు. పాక్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.
రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదానికి.. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన జవాన్లకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా. వారికి నివాళులు అర్పిస్తున్నా. గాయపడ్డ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా. వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమయాకమైన పౌరులకూ నివాళులు అర్పిస్తున్నా. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన అతి పెద్ద ఆపరేషన్. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎంతవరకైనా వెళ్తాం.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని పాకిస్థాన్ ఇకనైనా ఆపాలి. ఉగ్రవాదులే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేసిందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ రోజుకూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాం. అణు బాంబు బెదిరింపులకు సైతం భయపడలేదు. పాకిస్థాన్ ఎంత చెత్తగా ఇండియాను బెదిరించిందో ప్రపంచం మొత్తం చూసింది. శ్రీనగర్ గడ్డమీద నుంచి ఓ ప్రశ్న లేవనెత్తుతున్నా. బాధ్యత లేని.. మూర్ఖమైన దేశం చేతిలో అణుబాంబులు ఉండటం ఎంత వరకు మంచిది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆ బాంబులను స్వాధీనం చేసుకోవాలని’ అన్నారు.
ఇవి కూడా చదవండి
TikTok Live: టిక్టాక్ లైవ్లో మర్డర్.. కెమెరాలో రికార్డైన భయానక దృశ్యాలు
Operation Sindoor: పాక్ కుక్కలా భయపడింది.. అందుకే రాజీకి వచ్చింది