Rajnath Singh: ధూర్త పాక్ చేతిలో అణ్వాయుధాలు క్షేమం కాదు
ABN , Publish Date - May 16 , 2025 | 05:31 AM
పాకిస్థాన్ వంటి బాధ్యతారహితమైన, ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సురక్షితం కాదని, వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పరిధిలోకి తెచ్చి, పర్యవేక్షించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

వాటిని ఐఏఈఏ పరిధిలోకి తేవాలి: రాజ్నాథ్ సింగ్
శ్రీనగర్, మే 15: పాకిస్థాన్ వంటి బాధ్యతారహితమైన, ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సురక్షితం కాదని, వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పరిధిలోకి తెచ్చి, పర్యవేక్షించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాక్తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలపైనే జరుగుతాయని స్పష్టం చేశారు. భారత్ సాయుధ దళాల సాయంతో త్వరలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి గురువారం రాజ్నాథ్ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చారు. శ్రీనగర్లోని బాదామి బాగ్ కంటోన్మెంట్లో సైనికులను కలిసి మాట్లాడారు. వారి ధైర్య సాహసాలను కొనియాడారు. పాకిస్థాన్ అణు బెదిరింపులను ఏమాత్రం లెక్క చేయకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని, ఇదే భారత్ సంకల్ప బలానికి నిదర్శనమని చెప్పారు.