Chennai: కులదైవం అంటూనే గునపాలతో గుచ్చుతారా..
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:27 AM
‘మా అందరి కులదైవం మీరే అని పొగడుతూనే నా గుండెల్లో గునపాలు దించుతున్నారు. అన్నింటికీ మా అయ్యగారేనని చెబుతూ నన్ను అధఃపాతాళంలోకి తొక్కేస్తున్నారు. అడుగడుగునా అవమానిస్తున్నారు. ఒంటరిని చేసి, మూలన కూర్చోబెట్టాలని కుట్ర పన్నుతున్నారు’ అంటూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ తన కుమారుడైన పీఎంకే అధ్యక్షుడు అన్బుమణిపై నిప్పులు చెరిగారు.

- అయ్యగారంటూ అథఃపాతాళానికి తొక్కేస్తారా..
- అడుగడుగునా అవమానాలే
- నన్ను ఒంటరి చేసేందుకు కుట్ర
- త్వరలో తాడోపేడో తేల్చుకుంటా
- అన్బుమణిపై రాందాస్ తీవ్ర ఆగ్రహం
చెన్నై: ‘మా అందరి కులదైవం మీరే అని పొగడుతూనే నా గుండెల్లో గునపాలు దించుతున్నారు. అన్నింటికీ మా అయ్యగారేనని చెబుతూ నన్ను అధఃపాతాళంలోకి తొక్కేస్తున్నారు. అడుగడుగునా అవమానిస్తున్నారు. ఒంటరిని చేసి, మూలన కూర్చోబెట్టాలని కుట్ర పన్నుతున్నారు’ అంటూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ తన కుమారుడైన పీఎంకే అధ్యక్షుడు అన్బుమణిపై నిప్పులు చెరిగారు. గురువారం దిండివనం తైలాపురం గార్డెన్లో మీడియాతో మాట్లాడుతూ... తనకు పార్టీ కార్యాచరణ అధ్యక్షుడి (అన్బుమణి)కి మధ్య సాగిన చర్చలు ‘డ్రా’గా ముగిశాయని, పార్టీలోని 34 విభాగాలకు చెందిన 14 మంది పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయన్నారు.
వారి సూచన మేరకు పార్టీ అధ్యక్ష పదవి విడిచిపెట్టేందుకు సిద్ధమైన అన్బుమణి చర్చలకు రాకుండా మొండికేశారన్నారు. ఆ తర్వాతే తాను తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యానన్నారు. అన్బుమణి పార్టీని పూర్తిగా కమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడని, తన మనవడు ముకుందన్కు పార్టీ పదవి ఎందుకివ్వకూడదని ప్రశ్నిస్తే ‘మీకేం తెలియదు. గేటు మూసుకుని మునిమనవళ్ళతో ఆడుకోండి’ అంటూ యెద్దేవా చేశాడని ఆరోపించారు. తాను రోజూ వేలాదిమంది పార్టీ శ్రేణులను కలుసుకుంటూనే ఉన్నానని, వన్నియార్లంతా తనను కులదైవంగా భావిస్తున్నారని, వారికి తానే మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 46 యేళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన పీఎంకేకు అధ్యక్షుడిగా ఉండే హక్కు తనకు లేదా అని ప్రశ్నిస్తూ.. ఇలా అడగడమే తనకు అవమానంగా వుందని రాందాస్ తీవ్ర ఆవేదన చెందారు.
తాను దశాబ్దాలపాటు శ్రమించి నిర్మించిన పీఎంకే కోటలో అద్దెకు దిగిన అన్బుమణి తనను మెడపట్టి గెంటేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. జిల్లా కార్యదర్శులు తనను కలుసుకోకుండా అన్బుమణి ప్రయత్నిస్తున్నాడని, వేకువజామున వారికి ఫోన్ చేసి పార్టీ వ్యవస్థాపకుడి వద్దకు వెళ్లకూడదని బెదిరించాడని తెలిపారు. మరో మూడేళ్లు అన్బుమణి ఓపికపడితే తానే అతడికి పట్టాభిషేకం చేసేవాడినని, పార్టీని పూర్తిగా అప్పగించేవాడినన్నారు. ఏడేళ్ల క్రితం ప్రధాని మోదీ పదవీస్వీకార వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్బుమణి పార్టీ వ్యవహారాలను తనకు అప్పగించాలని అడిగాడని, ఆ తర్వాత చెన్నై తిరిగి వస్తుండగా తన మాటలు కష్టపెట్టి ఉంటే క్షమించమని అడిగాడని, అప్పుడే తాను కంటతడిపెట్టుకున్నానని రాందాస్ గుర్తు చేసుకున్నారు.
అన్బుమణి మాటలు క్రుంగదీయటంతో మహాబలిపురంలో బసచేశానని, ఆ సమయంలో తన కోడలు సౌమ్య అక్కడికి వచ్చి తన భర్తకు పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టాల్సిందేనంటూ ఆజ్ఞాపించిందని ఆరోపించారు. ఒకటిన్నర నెల తర్వాత తర్జనభర్జనలు జరిగాక అన్బుమణికి పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టానని చెప్పారు. ఆ సమయంలో పార్టీ వ్యవహారాల్లో కుటుంబంలోని మహిళలెవరూ జోక్యం చేసుకోకూడదని ఆంక్షలు విధించానని, వాటిని తోసిపుచ్చి ధర్మపురిలో సౌమ్యని అభ్యర్థిగా ప్రకటించి తన మాటకు గౌరవం లేకుండా చేశారని ఆరోపించారు. వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ అన్బుమణే చూసుకుంటాడని, అప్పటి వరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు
Read Latest Telangana News and National News