Modi Warns Pakistan: ఆపరేషన్ సిందూర్.. పాక్కు లక్ష్మణ రేఖ
ABN , Publish Date - May 14 , 2025 | 04:58 AM
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్కు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చిన మోదీ, అదంపూర్ ఎయిర్బేస్లో ప్రసంగిస్తూ సైనికుల త్యాగాలను ప్రశంసించారు. ఎస్-400 వ్యవస్థ పాక్ ధ్వంసం చేసిందన్న దుష్ప్రచారాన్ని ప్రత్యక్షంగా ఖండించారు.

‘భారత్ మాతాకీ జై’.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించింది
వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా
త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టికరిపించాయి
అణు బెదిరింపులనూ అపహాస్యం చేశాయి
మరోసారి పాక్ దాడికి యత్నిస్తే వినాశనమే!
భారత ఎస్-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. అదంపూర్ వైమానిక స్థావరంలో ఎస్-400 ముందు ప్రసంగించిన ప్రధాని మోదీ
అదంపూర్, మే 13: భారత్ మాతా కీ జై.. అనే నినాదం శత్రువుల చెవుల్లోనూ మార్మోగిందని, వారి వెన్నులో వణుకు పుట్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు స్పష్టమైన ‘లక్ష్మణ రేఖ’ను గీశామన్నారు. ‘‘భారతదేశం తన భద్రతా దళాలకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మన దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలు ఎనలేనివి’’ అని పేర్కొన్నారు. మంగళవారం మోదీ పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఇది భారత్లోని రెండో అతిపెద్ద ఎయిర్బేస్. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్ బలగాలు లక్ష్యంగా చేసుకోవాలని యత్నించిన వాటిలో అదంపూర్ వైమానిక స్థావరం కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు.. తాము ఈ స్థావరాన్ని ధ్వంసం చేశామని, ఎస్400 రక్షణ వ్యవస్థను కూడా నాశనం చేశామని పాక్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోని అదంపూర్ వైమానిక స్థావరానికి ప్రధాని మోదీ వెళ్లి, భద్రతా బలగాలతో మాట్లాడడం విశేషం. ‘భారత్ మాతా కీ జై’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మన సైన్యం శపథం చేసింది. మన బలగాలు చూపిన శక్తిసామర్థ్యాలను ఎంత ప్రశంసించినా తక్కువే. అణు బెదిరింపులను కూడా అపహాస్యం చేశాయి. భారతదేశ శక్తిసామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతా కీ జై నినాదం చేశాం.
ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మార్మోగింది. ఈ గడ్డపై నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం, విధానం. మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవాడి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం. మీరు చరిత్ర సృష్టించారు. నేను మీ ఆశీస్సుల కోసం వచ్చా’’అని మోదీ ఉద్వేగంగా చెప్పారు.
భారత్పై కుట్రలు చేస్తే.. విధ్వంసమే
‘‘మన త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టికరిపించాయి. భారత్పై పన్నాగాలు పన్నితే తమ విధ్వంసాన్ని కొనితెచ్చుకోవడమేనని ఉగ్రగురువులు గ్రహించారు. మన సైనిక శక్తి పాక్కు నిద్రపట్టనివ్వడం లేదు. ఆపరేషన్ సిందూర్ విషయంలో మానవ వనరుల శక్తి, యంత్రాలు, త్రివిధ దళాల మధ్య సమన్వయం అద్భుతం. మనం ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే.. పాక్ వాటిని కాపాడేందుకు పౌర విమానాలను పణంగా పెట్టింది. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేసింది. అలాంటి పరిస్థితుల్లో దాడులు ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ, మీరు అత్యంత కచ్చితంగా, పౌర విమానాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా.. కేవలం ఉగ్ర శిబిరాలపైనే అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశారు. మీరు చేసిన అద్భుతాన్ని చూసి నేను గర్వపడుతున్నా. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ, దాడి జరిగితే శత్రువును తుదముట్టిస్తుంది. మరోసారి దాడికి ప్రయత్నిస్తే వినాశనమే’’ అని మోదీ హెచ్చరించారు.
పాక్ తప్పుడు ప్రచారానికి చెక్
‘‘ఈ ఉదయం నేను అదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లాను. అక్కడ మన పోరాటయోధులను కలిశా’’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. వారితో దిగిన చిత్రాలను, వీడియోలను షేర్ చేశారు. అక్కడ గంటన్నరకు పైగా గడిపారు. ఆ సమయంలో మోదీ త్రిశూల్ లోగోతో కూడిన పశ్చిమ ఎయిర్ కమాండ్ టోపీని ధరించారు. ప్రధాని మోదీ షేర్ చేసిన చిత్రాల్లో చెక్కు చెదరకుండా ఉన్న ఎస్-400 రక్షణ వ్యవస్థ కనిపించింది. దీంతో, అదంపూర్లోని ఎస్-400 స్థావరాన్ని ధ్వంసం చేశామన్న పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినట్లైంది. ఎస్-400 రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని ప్రసంగించడం ద్వారా పాక్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మోదీ ప్రపంచానికి తెలిసేలా చేశారు.
భారత్కు ప్రతిష్ఠాత్మక స్థావరం!
అందపూర్ వైమానిక స్థావరం.. పంజాబ్లోని జలంధర్, హోషియార్పూర్ మధ్య ఉంది. ఇది పాకిస్థాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్లలోపే ఉంటుంది. భారత వాయుసేన (ఐఏఎ్ఫ)కు ఇది రెండో అతిపెద్ద ఎయిర్బేస్. ఇక్కడ ‘బ్లాక్ ఆర్చర్స్’గా పేర్కొనే ఐఏఎఫ్ 47వ స్క్వాడ్రన్ ఉంటుంది. దీంతో పాటు ‘తొలి సూపర్సోనిక్స్’గా పేర్కొనే 28వ స్క్వాడ్రన్ కూడా ఉంటుంది. ఈ స్క్వాడ్రన్లో సుఖోయ్-30ఎంకేఐ విమానాలు ఉంటాయి. 75 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ ఎయిర్బేస్ భారత్కు అత్యంత కీలకం, వ్యూహాత్మకం కూడా. ఈ స్థావరంపై పాక్ ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. 1965, 1971, కార్గిల్ యుద్ధం.. ఇలా పలుమార్లు పాకిస్థాన్ బలగాలు అదంపూర్ఎయిర్బేస్పై దాడులకు ప్రయత్నించి, విఫలమయ్యాయి. ఈ నెల 9, 10 తేదీల్లో పాక్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరు క్షిపణులను ప్రయోగించగా.. ఎయిర్బేస్కు 7 కి.మీ. దూరంలోనే మన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని కూల్చివేసింది.