Meghalaya murder: మేఘాలయ మర్డర్.. ఇంకా తెలీని సోనమ్ ఆచూకీ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:29 PM
మేఘాలయ మర్డర్ కేసు మిస్టరీ వీడడం లేదు. కొత్తగా పెళ్లయి మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్లిన భర్త రాజా రఘువంశీని కిరాతకులు కత్తితో పొడిచి చంపి లోయలో పడేశారు. నవ వధువు సోనమ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు.

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ మర్డర్ కేసు మిస్టరీ వీడడం లేదు. కొత్తగా పెళ్లయి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకి టూర్కు వెళ్లిన ఇద్దరు కొత్త దంపతుల్ని హత్య, కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. భర్త రాజా రఘువంశీని కిరాతకులు కత్తితో పొడిచి చంపి లోయలో పడేశారు. అతని మృతదేహం డ్రోన్ల సాయంతో కనుగొన్నారు. అయితే, నవ వధువు సోనమ్ రఘువంశీ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు. మే 24న ఈ దారుణం చోటుచేసుకోగా ఇంకా సోనమ్ ఆచూకీ దొరక్కపోవడంతో ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. నవ దంపతులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందినవారు.
రాజా రఘువంశీ, అతని భార్య సోనమ్ అదృశ్యం కావడానికి ఒక రోజు ముందు షిల్లాంగ్ లోని ఒక హోటల్లో దంపతులిద్దరూ నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు కొత్తగా బయటపడ్డ CCTV ఫుటేజ్లో కనుగొన్నారు. ఈ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో కుట్ర కోణం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మర్డర్ మిస్టరీని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మేఘాలయ సర్కార్. మేఘాలయ పోలీసులు దీన్ని హత్య, కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు.
ఈ జంట అదృశ్యం కావడానికి ముందు హైకింగ్(కొండప్రాంతాల్లో విహరించడం)కు వెళ్లే సమయంలో సోనమ్ తన ఫ్యామిలీతో మాట్లాడింది. ఇదే ఆమె చేసిన చివరి ఫోన్ కాల్. టూర్ కోసం దంపతులిద్దరూ స్థానికంగా ఒక స్కూటర్ను అద్దెకు తీసుకున్నారు. మే 24న తూర్పు ఖాసీ హిల్స్లోని సోహ్రారిమ్లో ఆ స్కూటర్ పార్క్ చేసి ఉంది. స్కూటర్ దొరికిన ప్రదేశానికి కొంత దూరంలో మే 30వ తేదీన సోమవారం నాడు లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనుగొన్నారు. అక్కడే రాజా ఫోన్, అతన్ని చంపడానికి ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తినీ కనుగొన్నారు.
ఇది హత్య కేసని స్పష్టంగా తెలుస్తుందని.. రాజా హత్యకు గురయ్యారని అందులో ఎటువంటి సందేహం లేదని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ (SP) వివేక్ సయీమ్ అన్నారు. మేఘాలయ పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సోనమ్ రఘువంశీ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) ఇంకా ప్రత్యేక బృందం సహా రాష్ట్రం, కేంద్రం నుంచి దర్యాప్తు సంస్థలూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రక్తం వంటి మరకలు ఉన్న నల్లటి రెయిన్కోట్ను ఆ ప్రాంతంలో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ అది నిజంగా రక్తమా.. కాదా, సదరు రెయిన్కోట్ తప్పిపోయిన మహిళదా.. కాదా? అనేది ఇంకా నిర్ధారించలేదు.
మేఘాలయ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు డిమాండ్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నివసిస్తున్న రాజా రఘువంశీ కుటుంబం తమ కుమారుడి హత్య, కోడలి అదృశ్యంపై దర్యాప్తును CBI కి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 'ఈ కేసులో సీబీఐ దర్యాప్తును మేము డిమాండ్ చేస్తున్నాం. స్కూటర్ పార్క్ చేసిన ప్రదేశం నుంచి 25 కి.మీ. దూరంలో రాజా మృతదేహం దొరికింది. అతన్ని కిడ్నాప్ చేసి మృతదేహం దొరికిన చోటికి తీసుకెళ్లారని తాము అనుమానిస్తున్నాం' అని బాధితుడి సోదరుడు విపిన్ అన్నారు.
కాగా, ఈ కేసులో న్యాయం జరుగుతుందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా చెబుతున్నారు. దర్యాప్తు జరుగుతోందని.. హత్యకు పాల్పడిన వారిని తప్పక పట్టుకుని తీరుతామని సీఎం చెప్పారు. 'సోహ్రాలో హత్యకు గురైన ఇండోర్ పర్యాటకుల విషాద కేసులో న్యాయం జరుగుతుంది. మృతుడు రాజా భార్యను గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మాకు దిగ్భ్రాంతిని కలిగించింది. మేఘాలయలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ లేవనెత్తినప్పటికీ, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. నేరస్థులను పట్టుకోవడంలో తమ ప్రభుత్వం ఎలాంటి అలసత్వం చూపబోదు' అని సంగ్మా అన్నారు.
ఇవి కూడా చదవండి: