Meghalaya Honeymoon Incident: హనీమూన్ హత్య కేసులో మరో షాకింగ్.. సోనమ్ చనిపోయిందని..
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:36 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించిన సోనమ్ తర్వాత పెద్ద స్కెచ్ వేసింది. తాను కూడా చనిపోయినట్టు నమ్మించడానికి మరో మహిళను చంపి..

Meghalaya Honeymoon Case Updates: ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య చేసిన తర్వాత సోనమ్ బుర్ఖా ధరించి మేఘాలయ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. సోనమ్, తన స్నేహితుడు రాజ్ ఇచ్చిన బుర్ఖా వేసుకొని పోలీసులకు కనిపించకుండా తప్పించుకుంది. ముందుగా ఆమె శిల్లాంగ్ నుంచి గౌహతికి టాక్సీలో వెళ్లింది. ఆ తర్వాత బస్సులో సిలిగురి (ప.బెం), తరువాత పాట్నా, అక్కడి నుంచి రైలులో లక్నోకి, చివరగా బస్సులో ఇండోర్కు వెళ్లినట్లు తెలుస్తోంది.
వేరే మహిళను చంపే పథకం..
మేఘాలయ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొదట రాజ్ను గౌహతిలో చంపాలనుకున్నారు. కానీ అక్కడ ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత సోనమ్ సూచన మేరకు రాజ్ తన ముగ్గురు స్నేహితులు కలిసి మేఘాలయాకి వెళ్లారు. అక్కడ వెసాడాంగ్ జలపాతాల దగ్గర మే 19న మధ్యాహ్నం 2:00 – 2:18 మధ్యలో రాజా రఘువంశీని.. రాజ్, అతడి స్నేహితులు కత్తితో క్రూరంగా దాడి చేసి చంపారు. తర్వాత మృతదేహాన్ని ఒక కాలువలో పడేశారు. అయితే, రాజ్ చనిపోయిన తర్వాత, సోనమ్ కూడా చనిపోయినట్టు నమ్మించాలనుకున్నారు. ఇందుకోసం వేరే ఒక మహిళను చంపి, ఆమె శవాన్ని సోనమ్దిగా చూపించాలని స్కెచ్ చేశారు. కానీ ఇది అమలవకముందే పోలీసులు వారిని పట్టుకున్నారు.
డబ్బు కోసం కాదు.. స్నేహం కోసమే..
రాజా రఘువంశీను చంపిన వారిని ముందుగా అందరూ కాంట్రాక్ట్ కిల్లర్లు అనుకున్నారు. కానీ, వారు రాజ్కి స్నేహితులు. విశాల్, ఆకాష్, ఆనంద్ ఈ ముగ్గురు స్నేహం కోసం రాజాను చంపి హంతకులుగా మారారు. వీరు డబ్బు కోసం కాదు.. స్నేహం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజ్ తన స్నేహితులకు కేవలం రూ 50,000 ఇచ్చినట్లు సమాచారం. స్థానిక గైడ్ ఒక మీడియాకు ఇచ్చిన సమాచారంతో అసలు నిజం బయటపడింది.
గైడ్ చెప్పిన ప్రకారం.. రాజ్, సోనమ్, మరో ముగ్గురు కలిసి సిలిగురికి వెళ్లారు. అప్పుడు సోనమ్ కిడ్నాప్ అయినట్టు నటించాలని రాజ్ చెప్పాడట. కానీ జూన్ 8న మేఘాలయ పోలీసులు ఆమెను వెతుకుతూ యూపి, మధ్యప్రదేశ్కు వెళ్లారు. అయితే, రాజ్ స్నేహితుడైన ఆకాష్ అరెస్టైన వెంటనే రాజ్ భయపడి, సోనమ్కి తన కుటుంబానికి తాను ముఠా నుంచి తప్పించుకున్నట్టు చెప్పమని సూచించాడు. కానీ చివరికి పోలీసుల ముందు సోనమ్ గాజీపూర్లో లొంగిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఐదుగురు నిందితులను 8 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) దర్యాప్తు చేస్తోంది.
అయితే, అసలు సోనమ్ ఎవరి కోసం తన భర్తను చంపింది? సోనమ్ తన భర్తను చంపించిన తర్వత రాజ్తో కాకుండా, తాను ఒక్కతే ఇండోర్కు ఎందుకు వెళ్లింది? తనకు అంతగా పెళ్లి ఇష్టం లేకుంటే ఇంట్లో నుండి పారిపోవాల్సింది కదా.. పెళ్లి చేసుకుని మరీ చంపించడం ఏంటి? తన జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా రాజ్ను అడ్డం పెట్టుకుని అతడి స్నేహితుల జీవితాలను కూడా నాశనం చేసింది. పాపం.. పెళ్లి చేసుకున్న పాపానికి రాజాను కిరాతకంగా చంపి తండ్రి లేని అతడి కుటుంబానికి ఏ అండ లేకుండా చేసింది. ఇంత దారుణానికి పాల్పడిన సోనమ్ను ఖచ్చితంగా ఉరితీయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆమె చెప్పిందే జరిగింది
For More National News