Share News

Manipur: మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే ఎమ్మెల్యేలు

ABN , Publish Date - May 28 , 2025 | 02:50 PM

మణిపూర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని, ఆ కారణంగానే తాము గవర్నర్‌ను కలిసామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్‌ నిషికాంత సింగ్ తెలిపారు.

Manipur: మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే ఎమ్మెల్యేలు

ఇంఫాల్: మణిపూర్‌ (Manipur)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్.బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి గత ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పట్నించి శాసనసభ సుప్తచేతనావస్థలో (suspended animation) ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధవారంనాడు రాజ్‌భవన్‌ చేరుకుని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ సన్నద్ధత తెలియజేశారు.


దీనిపై ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్‌ నిషికాంత సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని, ఆ కారణంగానే తాము గవర్నర్‌ను కలిసామని చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పేపరును గవర్నర్‌కు అందజేశామని, మణిపూర్‌లోని ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. ప్రజా మద్దతును కూడా తాము కోరుతున్నామన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, 10 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసారని తెలిపారు.


గవర్నర్‌తో చర్చించాం: బీరేన్ సింగ్

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్‌ను కలిసి చర్చించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మంగళవారంనాడు తెలిపారు. గ్వల్తాబి ఘటనపై ప్రజలు ఆందోళన బాట పట్టడంతో నిరసనకారులను ఆహ్వానించి చర్చలు జరపాలని కోరినట్టు చెప్పారు. ఇంఫాల్ వ్యాలీలో గత వారం రోజులుగా గ్వల్తాబి ఘటనపై ప్రజలు నిరసనలు సాగిస్తున్నారు. ఈనెల 20న ఉఖ్రుల్ జిల్లాలోని శిరుయ్ లిల్లీ ఉత్సవ విశేషాలను కవర్ చేసేందుకు జర్నలిస్టులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సును భద్రతా సిబ్బంది ఆపారు. బస్సు విండ్‌షీల్డ్‌పై రాసి ఉన్న మణిపూర్ అనే రాష్ట్రం పేరు కనిపించకుండా తెల్లకాగితంతో కప్పాలని బస్సులోని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్ గుర్తింపును అవమానించిన గవర్నర్ క్షమాపణ చెప్పాలని నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, మణిపూర్‌ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకూ ఉంది.


ఇవి కూడా చదవండి..

ఇక భారత్‌ను చూసి పాక్ వణకాల్సిందే..

రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే అధికారిక ప్రకటన

Read Latest National News and Telugu News

Updated Date - May 28 , 2025 | 04:57 PM